నిజామాబాద్​ సొసైటీలో రూ.30 లక్షల గోల్​మాల్

నిజామాబాద్​ సొసైటీలో రూ.30 లక్షల గోల్​మాల్

పంట రుణాలు కట్టినా రైతులకు నోటీసులు

నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్​ సొసైటీలో రైతులు చెల్లించిన సుమారు రూ.30 లక్షల విలువ పంట రుణాల నగదు దుర్వినియోగమైంది. కట్టిన రుణాలు చెల్లించమని రైతులకు నోటీసులు వచ్చాయి. దీంతో సుమారు 30 మంది రైతులు కోటగల్లిలోని ఆఫీస్​కు వచ్చారు. తాము తీసుకున్న క్రాప్​లోన్లను 2022లోనే ముట్టజెప్పామని, అప్పటి సొసైటీ కార్యదర్శి శివరాంరాజు, క్యాషియర్​ భాస్కర్​నుంచి తీసుకున్న రశీదు, నోడ్యూస్ సర్టిఫికెట్లను చైర్మన్​ శేఖర్, వైస్​చైర్మన్​ రవీందర్​కు చూపించారు.

డబ్బులు చెల్లించినా లోన్​కట్టాలని నోటీసు రావడమేంటని నిలదీశారు. ఆన్​లైన్​లో పరిశీలించగా, రుణాలు ఇప్పటికీ బాకీ ఉన్నట్లు తెలిసి విస్తుబోయారు. అవినీతి ఆరోపణలతో గతేడాది సస్పెండయిన కార్యదర్శి శివరాం రాజు ఆధ్వర్యంలోనే  రైతుల సొమ్ము గోల్​మాల్​ అయిందని, ఆయనపై విచారణ చేసిన అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తామని చైర్మన్​ శేఖర్​ వారికి చెప్పారు. గవర్నమెంట్​పంట రుణమాఫీ కూడా తమకు రాలేదని రైతులు తెలిపారు. ​