
- రేవంత్ ఒత్తిడితోనే కమిషన్ నోటీసులిచ్చింది: గంగుల కమలాకర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సాధించిన కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంతో ప్రజలు బాధపడుతున్నారని, తెలంగాణ సమాజం ఒక్కసారిగా ఉలిక్కి పడిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కేసీఆర్కు నోటీసులు ఇవ్వడమంటే యావత్ తెలంగాణ సమాజానికి, కాళేశ్వరం కింద పంటలు పండించుకున్న రైతులకు నోటీసులు ఇవ్వడమేనన్నారు. ఇంకా ఎవరినీ పిలవం.. విచారణ పూర్తయిందని కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ చెప్పారని.. కానీ, సీఎం రేవంత్రెడ్డి ఒత్తిడితోనే జస్టిస్ఘోష్ తన వైఖరి మార్చుకుని కేసీఆర్, హరీశ్ రావుకు నోటీసులిచ్చారని అన్నారు.
ఆ నోటీసులు పూర్తిగా రాజకీయ దురుద్దేశం, కక్షతో కూడుకున్నవని అన్నారు. బుధవారం ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. నోటీసులు ఇప్పించి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. ఇల్లు కట్టేటప్పుడు బాత్రూం లీక్ అయితే ఇల్లంతా కూలగొట్టుకుంటామా? అని ప్రశ్నించారు. మేడిగడ్డకు రిపేర్లు చేయించనందుకు అసలు రేవంత్ రెడ్డి మీద కమిషన్ వేయాలని అన్నారు. గుల్జార్ హౌస్ ఘటన, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల దందాల నుంచి డైవర్ట్ చేసేందుకే కమిషన్నోటీసులతో చిల్లర రాజకీయాలకు తెరలేపారన్నారు.
కాళేశ్వరం కూలిందన్న విషప్రచారం మానుకోవాలి: సుధీర్ రెడ్డి
సీఎంగా రేవంత్ రెడ్డి అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఎల్బీనగర్ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. సీఎం పదవి వచ్చింది కేసీఆర్కు నోటీసులు ఇచ్చేందుకు కాదన్న విషయాన్ని రేవంత్ గ్రహించాలన్నారు. కాళేశ్వరం కూలిపోయిందని రేవంత్దివాలాకోరు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ విష ప్రచారాన్ని వెంటనే మానుకోవాలన్నారు. రేవంత్ సీఎం అయ్యాక ఎన్నో ప్రమాదాలు జరిగాయని, వాటిపై కమీషన్లు వేశారా? అని ప్రశ్నించారు.
అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్ముతారంటూ రేవంత్ రెడ్డి గతంలో చెప్పారని, ఇప్పుడూ అవే అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్విమర్శించారు. పాలన చేతగాక.. సమస్యలు పరిష్కరించలేకే కేసీఆర్కు నోటీసులిచ్చారని సత్యవతి రాథోడ్అన్నారు. ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుదాకా నీళ్లు రావడానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టేనన్నారు. కాగా, ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్ పాల్గొన్నారు.