కరెంట్​ ఒప్పందాలపై కేసీఆర్​కు నోటీసులు

కరెంట్​ ఒప్పందాలపై కేసీఆర్​కు నోటీసులు
  • ఈ నెల 15కల్లా వివరణ ఇవ్వాలని జస్టిస్ ​నర్సింహారెడ్డి కమిషన్​ ఆదేశాలు
  • చత్తీస్​గఢ్​తో అగ్రిమెంట్ ​వద్దని అధికారులు చెప్పినా బీఆర్ఎస్​ సర్కారు వినలే
  • భారీగా ఖర్చు చేసి కరెంట్​ కొన్నరు.. ఎంత నష్టం జరిగిందో తేలుస్తం
  • టెండర్లు లేకుండా భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ నిర్మాణ పనులు
  • భద్రాద్రి థర్మల్​ ప్లాంట్​లో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ
  • ఇప్పటివరకు కేసీఆర్​ సహా 25 మందికి నోటీసులు
  • వివరణ సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగతంగా అటెండ్​ కావాల్సిందే
  • మాజీ సీఎండీ ప్రభాకర్​రావు, ఎస్​కే జోషి, అర్వింద్​ కుమార్​నూ విచారించాం
  • మీడియాతో చిట్​చాట్​లో జస్టిస్​ నర్సింహారెడ్డి సంచలన విషయాలు 

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్​​కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలపై బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​కు జస్టిస్​ నర్సింహారెడ్డి కమిషన్ మరోసారి నోటీసులు అందజేసింది.  ఈ నెల 15వ తేదీకల్లా కేసీఆర్​ తన వివరణను అందజేయాలని స్పష్టం చేసింది. గత ఏప్రిల్​ నెలలోనే కేసీఆర్​కు నోటీసులు పంపినప్పటికీ  జులై 30 వరకు తాను వివరణ ఇవ్వలేనని కేసీఆర్ నుంచి సమాధానం వచ్చింది. 

కానీ ఎంక్వైరీకి గడువు తక్కువగా ఉండడంతో ఈ నెల 15లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ వివరణ పంపాలని, సమాధానం సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందేనని మరోసారి నోటీస్​ పంపినట్టు  జస్టిస్ నర్సింహారెడ్డి మంగళవారం వెల్లడించారు. గత సర్కారు హయాంలో చత్తీస్​గఢ్​తో జరిగిన విద్యుత్​ కొనుగోలు ఒప్పందాలు,  యాదాద్రి, భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణ పనుల్లో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం  జస్టిస్ నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో జ్యుడీషియల్​ కమిషన్ ​వేసింది. ఇటీవల విచారణను స్పీడప్ చేసిన జస్టిస్​ నర్సింహారెడ్డి, ఇందుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను బీఆర్​కే భవన్​లో మీడియాతో చిట్​చాట్ ​చేశారు. 

ఇప్పటివరకు 25 మందికి నోటీసులు 

చత్తీస్​గఢ్​ తో విద్యుత్​ ఒప్పందాలు, టెండర్లు లేకుండా నామినేషన్​ పద్ధతిలో భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్లాంట్స్ నిర్మాణ పనుల కేటాయింపు.. ఈ  మూడు అంశాలపై విచారణ కొనసాగుతోందని జస్టిస్​ నర్సింహారెడ్డి చెప్పారు. ఈ మూడు నిర్ణయాలు అప్పటి బీఆర్​ఎస్​ ప్రభుత్వమే తీసుకుందని, దీంతో జెన్​కోకు ఎలాంటి  సంబంధం లేదని తెలిపారు. విద్యుత్​ ఒప్పందాలతోపాటు థర్మల్​ప్లాంట్ల పై ఎంక్వైరీ స్పీడ్​గా జరుగుతోందని, ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు 25 మందికి నోటీసులు ఇచ్చామని వెల్లడించారు.

 ‘ఇప్పటికే చాలా మంది నుంచి వివరణలు వచ్చాయి. విద్యుత్​ సంస్థల మాజీ సీఎండీలు, ప్రస్తుత సీఎండీని కూడా విచారించాం. సోమవారం ట్రాన్స్​కో, జెన్​కో మాజీ సీఎండీ  ప్రభాకర్ రావు, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్​ చందాను విచారించాం. మంగళవారం అప్పటి ఇంధనశాఖ ప్రిన్సిపల్​సెక్రటరీలు ఎస్​కే జోషి,  అర్వింద్ కుమార్ తో సమావేశమయ్యాం. వివరాలు తీసుకున్నాం’ అని జస్టిస్​ నర్సింహారెడ్డి తెలిపారు. 

అర్వింద్​కుమార్ ​లేఖనూ పట్టించుకోలే.. 

చత్తీస్​గఢ్​ ఒప్పందాన్ని తప్పు పడుతూ అప్పట్లో ఇంధనశాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీగా ఉన్న అర్వింద్​ కుమార్ ఈఆర్​సీకి లెటర్​ రాసినా ప్రభుత్వం పట్టించుకోలేదని తమ విచారణలో తేలినట్టు జస్టిస్​ నర్సింహారెడ్డి చెప్పారు. ‘రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగినప్పుడు కేంద్రానికి మధ్యవర్తిత్వం ఇవ్వాలి.  కానీ ఈ ఒప్పందంలో చత్తీస్ గఢ్​కు అధికారం ఇచ్చారు. భారీగా నిధులు ఖర్చు చేసి కరెంటు కొనుగోలు చేశారు. మొత్తం ప్రక్రియలో ఎంత నష్టం జరిగిందనేది తేలాల్సి ఉంది.  భద్రాద్రి థర్మల్​ ప్లాంట్​లో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడారు. 

భద్రాద్రి, యాదాద్రి థర్మల్​ ప్లాంట్​ నిర్మాణ పనులకు టెండర్లు పిలవకుండా నామినేషన్​పద్ధతిలో కట్టబెట్టారని ప్రాథమిక అంచనాకు వచ్చాం. ఇప్పటికీ యాదాద్రి థర్మల్​ప్లాంట్ నిర్మాణం పూర్తి కాలేదు. ఆగస్టు వరకు ఒక ప్లాంట్​ అందుబాటులోకి వస్తుందని అంటున్నారు.  కానీ రైల్వే లైన్ ఇప్పటికీ వెయ్యలేదు. అధికారుల నుంచే కాకుండా పలువురు విద్యుత్​ రంగ ప్రముఖులు నుంచి కూడా పలు రకాల సమాచారం తీసుకుంటున్నాం’ అని జస్టిస్​ నర్సింహారెడ్డి చెప్పారు. 

వివరణ సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగతంగా హాజరుకావాల్సిందే 

మాజీ సీఎం కేసీఆర్​తో సహా నోటీసులు అందుకున్న 25 మంది ఇచ్చే సమాధానాలు సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని కోరుతామని జస్టిస్​నర్సింహారెడ్డి తెలిపారు. నోటీసులు అందుకున్న 25 మందిలో కేసీఆర్ ఒక్కరే పొలిటీషియన్​ అని,  మిగిలిన 24 మంది ఈ 3 అంశాలతో సంబంధం ఉన్న అధికారులేనని స్పష్టం చేశారు. నాటి థర్మల్​ ప్లాంట్స్​నిర్మాణం,  విద్యుత్​కొనుగోలు ఒప్పందాల్లో  ఏ స్థాయిలో ఏమి జరిగిందనే వివరాలను తెలుసుకుంటున్నామని తెలిపారు. నోటీసులకు వారు ఇచ్చే సమాధానాలను బట్టి తదుపరి చర్యలుంటాయని జస్టిస్​నర్సింహారెడ్డి స్పష్టం చేశారు.

ఇప్పటికే చాలా మంది నుంచి వివరణలు వచ్చాయి. విద్యుత్​ సంస్థల మాజీ సీఎండీలు, ప్రస్తుత సీఎండీని కూడా విచారించాం. సోమవారం ట్రాన్స్​కో, జెన్​కో మాజీ సీఎండీ  ప్రభాకర్ రావు, అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్​ చందాను విచారించాం. అప్పటి ఇంధన శాఖ ప్రిన్సిపల్​ సెక్రటరీలు ఎస్​కే జోషి,  అర్వింద్ కుమార్​తో మంగళవారం సమావేశమయ్యాం. అందరి నుంచి వివరాలు తీసుకున్నాం.

- జస్టిస్​ నర్సింహారెడ్డి