లా యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ : ఇంటర్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..

లా యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ : ఇంటర్ విద్యార్థులకు గోల్డెన్ ఛాన్స్..

దేశవ్యాప్తంగా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్–2026) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 న్యాయ విశ్వవిద్యాలయాల్లో ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ లా, ఏడాది ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆగస్టు 1 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభమవుతుంది. చివరి తేదీ అక్టోబర్ 1. జాతీయ స్థాయిలో డిసెంబర్ 7న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో లా పూర్తిచేసిన అభ్యర్థులు క్యాంపస్ సెలెక్షన్ ద్వారా మల్టీ నేషనల్ కంపెనీలు, దేశీయ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందవచ్చు. 

ఇంటర్మీడియట్ తర్వాత న్యాయ విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు క్లాట్ మంచి చాయిస్. ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ లా చదవడం ద్వారా ఒకవైపు డిగ్రీ మరోవైపు న్యాయవిద్య రెండూ ఏకకాలంలో పూర్తవుతాయి. తమ అభిరుచికి ఇష్టమైన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం, బీఎస్​డబ్ల్యూతోపాటు లా పూర్తి చేయవచ్చు. క్లాట్ స్కోర్​తో హైదరాబాద్​లోని నల్సార్, ఎన్ఎస్​యూ(బెంగళూరు), ఎన్ఎల్ఐయూ(భోపాల్), డబ్ల్యూబీఎన్​యూజేఎస్(కోల్ కతా), ఎన్ఎల్​యూ(జోధ్ పూర్), హెచ్ఎన్ఎల్​యూరాయ్​పూర్), జీఎన్ఎల్​యూ(గాంధీనగర్), జీఎన్ఎల్​యూ(సిల్వస్సా, గుజరాత్), ఆర్ఎంఎల్ఎన్ఎల్​యూ(లక్నో), ఆర్​జీఎన్​యూఎల్(పంజాబ్), సీఎన్ఎల్​యూ(పాట్నా), ఎన్ యూఏఎల్ఎస్(కొచ్చి), ఎన్ఎల్​యూ(ఒడిశా), ఎన్​యూఎస్ఆర్ఎల్(రాంచీ), ఎన్ఎల్​యూజేఏ(అసోం), డీఎస్ఎన్ఎల్​యూ(విశాఖపట్టణం), టీఎన్ఎల్ఎల్​యూ(తిరుచిరాపల్లి), ఎంఎన్ఎల్​యూ(ముంబయి), ఎంఎన్ఎల్​యూ(నాగ్​పూర్), ఎంఎల్ఎల్​యూ(ఔరంగాబాద్), హెచ్​పీఎన్ఎల్​యూ(సిమ్లా), డీఎన్ఎల్​యూ(జబల్​పూర్), డీబీఆర్ఏఎన్ఎల్​యూ(హర్యానా), ఎన్ఎల్​యూటీ(అగర్తలా), ఆర్​పీఎన్ఎల్​యూపీ(ప్రయాగ్ రాజ్), ఐఐయూఎల్ఈఆర్(గోవా)లో ప్రవేశాలు పొందవచ్చు. 

విద్యార్హతలు: కనీసం 45 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు లేదా సమాన గ్రేడును కలిగి ఉండాలి. 2026, మార్చి/ ఏప్రిల్​లో ఇంటర్మీడియట్ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు కూడా అర్హులే. అయితే, ప్రవేశాల సమయానికి ఇంటర్మీడియట్​​లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఎలాంటి గరిష్ట వయోపరిమితి లేదు.  

ఎగ్జామ్ ప్యాటర్న్ : అభ్యర్థుల కాంప్రహెన్షన్, రీజనింగ్ స్కిల్స్ అండ్ ఎబిలిటీస్ తెలుసుకునేలా ప్రశ్నలు ఉంటాయి.  ప్రధానంగా న్యాయ విద్య అభ్యసించడానికి అవసరమైన ఆప్టిట్యూడ్ స్కిల్స్​ను పరీక్షిస్తారు. ఆఫ్​లైన్ మోడ్​లో ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలో నిర్వహించే యూజీ– క్లాట్​లో 120 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. 2 గంటల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. ఐదు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రతి సెక్షన్​లోనూ ప్యాసేజ్​లు ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. ఇంగ్లిష్​  లాంగ్వేజ్ 22– 26 ప్రశ్నలు (20 శాతం వెయిటేజీ), జనరల్ నాలెడ్జ్​తోపాటు కరెంట్ అఫైర్స్ 28 –32 ప్రశ్నలు(25 శాతం వెయిటేజీ), లీగల్ రీజినింగ్ 28– 32 ప్రశ్నలు (25 శాతం వెయిటేజీ), లాజికల్ రీజనింగ్ 22 – 26 ప్రశ్నలు(20 శాతం వెయిటేజీ), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 10–14 ప్రశ్నలు(10 శాతం వెయిటేజీ)  అడుగుతారు. 

సమానమైన మార్కులు వస్తే: ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు సమానమైన మార్కులు సాధిస్తే లీగల్ ఆప్టిట్యూడ్ సెక్షన్​లో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు.  ఆ తర్వాత గరిష్ట వయసును పరిగణనలోకి తీసుకుంటారు. అప్పటికీ అభ్యర్థులు సమానంగా ఉంటే కంప్యూటరైజ్ డ్రా ద్వారా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. 

పీజీ క్లాట్: కనీసం 50 శాతం మార్కులతో ఎల్ఎల్​బీ డిగ్రీ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులు లేదా సమాన గ్రేడ్ కలిగి ఉంటే సరిపోతుంది. 2026, ఏప్రిల్/ మే నెలలో ఎల్ఎల్​బీ చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు కూడా అర్హులే. అయితే, ప్రవేశాల సమయానికి ఎల్ఎల్​బీ​లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. 
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఎన్ఆర్ఐ అభ్యర్థులకు రూ.4000. ఎస్సీ, ఎస్టీ, బీపీఎల్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.3500. 

ఎగ్జామ్ ప్యాటర్న్ :ఆఫ్​లైన్ మోడ్​లో జరిగే పీజీ క్లాట్ ఎంట్రెన్స్​లో 120 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. 2 గంటల్లో ఎగ్జామ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పుడు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు. కాన్​స్టిట్యూషన్, ఫ్యామిలీ, అడ్మినిస్ట్రేటివ్, పబ్లిక్ ఇంటర్నేషనల్, ల్యాక్స్,  క్రిమినల్, ప్రాపర్టీ, కంపెనీ, ట్యాక్స్, లేబర్, ఇండస్ట్రియల్, ఎన్విరాన్​మెంటల్ లా అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

ముఖ్యమైన తేదీలు
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఎన్ఆర్ఐ అభ్యర్థులకు రూ.4000. ఎస్సీ, ఎస్టీ, బీపీఎల్, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.3500. 
అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 1.
అప్లికేషన్ లాస్ట్ డేట్: అక్టోబర్ 31.
క్లాట్ ఎగ్జామ్ డేట్: 7 డిసెంబర్   2026 మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు.