విజయవాడలో ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్, దేవినేని నెహ్రూ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు నందమూరి లక్ష్మీపార్వతి, డైరెక్టర్ రామ్గోపాల్ వర్మ, కొడాలి నాని, పేర్నినాని హాజరయ్యారు. ఎన్టీఆర్ ఆశయాలను సమాధి చేసిన వ్యక్తి చంద్రబాబు అయితే...ఏపీలోని ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన గొప్ప వ్యక్తి సీఎం వైయస్ జగన్ అని అన్నారు లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ వారసులం అంటూ ఎవరెవరో డబ్బాలు కొట్టుకుంటున్నారని, కేవలం కడుపున పుట్టినంత మాత్రాన వారసులు కాబోరని వైఎస్ఆర్సీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి అన్నారు. ఎన్టీఆర్కు చివరి వరకూ అండగా నిలబడిన వారే నిజమైన వారసులు అని అన్నారు. ఎన్టీఆర్కు చివరి క్షణాల్లో అండగా ఉన్నది దేవినేని నెహ్రూ మాత్రమే అని,ఆయనే ఎన్టీఆర్కు అసలైన వారసుడు అన్నారామె.
లోకేష్ కు మాట్లాడటం కూడా రాదు
విజయవాడ నడిబొడ్డున ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉందని లక్ష్మీ పార్వతి అన్నారు. ఎన్టీఆర్కు జరిగిన అన్యాయంపై పోరాడి పోరాడి తాను అలసిపోయానని, తన ఆవేదనను ఒక్కరు కూడా పట్టించుకోలేదని అన్నారు. మాట్లాడటం కూడా రాని నారా లోకేష్ ఎన్టీఆర్ కి ఎలా వారసుడవుతాడని ఆమె అన్నారు. ఎన్టీఆర్ను ఈ దుర్మార్గులు మోసం చేశారని, అలాంటివారు ఎలా వారసులు అవుతారని ప్రశ్నించారు. చంద్రబాబు అంత నీచుడు మరొకడు లేడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వెన్నుపోటుపై ఎన్టీఆర్ ఎంతో బాధపడ్డారని, ఎన్టీఆర్ను చంద్రబాబు ఎన్నోసార్లు అవమానించాడని అన్నారు. ఎన్టీఆర్ పేరు కానీ, ఫొటో కానీ పెట్టుకునే అర్హత చంద్రబాబుకు లేదని చెప్పారు. ఎన్టీఆర్ ఆశయాలను సమాధి చేసిన వ్యక్తి చంద్రబాబు అని లక్ష్మీపార్వతి మాట్లాడారు.
సీఎం జగన్ కు ప్రశంసలు…
కొత్తగా ఏర్పడ్డ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టిన సీఎం జగన్కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. క్లిష్టసమయంలో డైరెక్టర్ రాం గోపాల్వర్మ తనకు ధైర్యాన్ని ఇచ్చారని, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో తన పాత్ర గురించి అందరికీ తెలియజెప్పారని అన్నారు. తన క్యారెక్టర్ను తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినపుడు తనకు పోసాని కృష్ణ మురళి ఓ సోదరుడిగా అండగా నిలిచారని అన్నారు.