న‌ర్సు కిడ్నాప్.. లాడ్జిలో నిర్భంధించి చిత్రహింసలు

న‌ర్సు కిడ్నాప్.. లాడ్జిలో నిర్భంధించి చిత్రహింసలు

హైద‌రాబాద్‌లో కిడ్నాప‌ర్లు రెచ్చిపోయారు. ఇంట్లో ఉన్న మహిళను బలవంతంగా కారులో ఎత్తుకుని వెళ్లి.. ఆ త‌ర్వాత ఓ లాడ్జ్ లో నిర్భంధించి, ఆమెను చిత్ర‌హింస‌ల‌కు గురిచేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కిడ్నాప్ జ‌రిగింది. వివ‌రాల ప్ర‌కారం.. నల్గొండ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళ నర్సుగా పనిచేస్తుండగా, ఆమె భర్త ల్యాబ్ టెక్నిషియన్‌గా చేస్తున్నారు. మూడేళ్ల క్రితం మణికొండ ప్రాంతానికి చెందిన ఆవుల రాజేశ్ అనే వ్య‌క్తి బాధిత నర్సు దగ్గర రూ.55లక్షల అప్పు చేశాడు. అయితే పదిరోజుల్లో డబ్బు చెల్లిస్తానన్న అతడు ఈలోపు నమ్మకం లేకుంటే వనపర్తిలో ఏడు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పాడని.. కానీ రెండు ప్లాట్లను మాత్ర‌మే రిజిస్ట్రేషన్ చేసి, పత్రాల్లో మాత్రం నెలరోజులకు డబ్బు తిరిగి చెల్లిస్తానని రాసినట్లు బాధితురాలు తెలిపింది.

అప్పు తీర్చాలని డిమాండ్ చేసిన తనను ఇటీవల సోమశేఖర్, నక్కల రాజేందర్ యాదవ్, పవన్‌రెడ్డి అనే వ్య‌క్తులు త‌న ఇంటికి వ‌చ్చి బ‌ల‌వంతంగా కిడ్నాప్ చేశారని, ఆ తర్వాత శంషాబాద్‌లోని లాడ్జీలో బంధించారని బాధితురాలు వాపోయింది. అప్పటికే లాడ్జీలో ఉన్న ఏడుగురు చిత్ర హింసలకు గురి చేశారని, తాకరాని చోట్ల తాకి పైశాచిక ఆనందం పొందార‌ని, కత్తులతో బెదిరిస్తూ ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారని కన్నీరు మున్నీరయ్యింది. వనపర్తిలోని ఆవుల రాజేశ్ ఇంటికి వెళ్లి ప్రశ్నించగా అతను జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టారని ఆవేదన వ్యక్తం చేస్తూ.. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు ఐపీసీ 406, 365, 354, 342, 323, 504, 506 రెడ్ విత్ 34 కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.