హైదరాబాద్, వెలుగు:‘కరోనా టైమ్ అయినా జాబ్ ఆఫరొస్తే భయపడకుండా చేద్దామనుకున్నం. కానీ జీతమెంతో చెప్పరట. ఎన్ని రోజులు జాబుంటదో చెప్పరట. ఆఫర్ లెటర్ ఇయ్యరట. కొవిడ్ కవరేజ్లోకి రామట. మరి ఏం చూసి చేరాలె?’’ అంటూ టిమ్స్లో ఉద్యోగానికి అప్లై చేసుకున్న నర్సులు మండిపడ్డారు. ఉన్న జాబ్లు వదులుకొని వస్తే మజాక్ చేసి పంపిస్తరా అని ఫైర్ అయ్యారు. ఉద్యోగాల్లో చేరేందుకు సోమవారం నగరానికి వచ్చిన నర్సులంతా గాంధీ హాస్పిటల్కి వెళ్లగా అక్కడ అవమానించడంతో కోఠిలోని డీఎంఈ (డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్) ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు.
టిమ్స్లో ఉద్యోగాలని చెప్పి..
గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో టిమ్స్ (తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం కాంప్లెక్స్లో ఏర్పాట్లు చేసింది. 975 బెడ్ల హాస్పిటల్గా మార్చింది. స్టాఫ్ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది. కాంట్రాక్ట్ బేస్డ్ పోస్టులు ప్రకటించింది. దీంతో చాలా మంది నర్సులు అప్లై చేసుకున్నారు. ఈ నెల 3న సర్టిఫికేట్ల వెరిఫికేషన్కు రమ్మని మెసేజ్ వెళ్లింది. హెడ్ నర్సుకు 28 వేలు, స్టాఫ్ నర్సుకు రూ. 25 వేల జీతం ప్రకటించారు. దాదాపు 600 మంది వెరిఫికేషన్కు హాజరయ్యారు. 152 మందిని సెలెక్ట్ చేసుకున్నారు. మిగతా వారికి వేరే హాస్పిటళ్లలో చాన్స్ ఇస్తామన్నారు. సెలెక్టయిన వాళ్లలో కొందరికి గాంధీ హాస్పిటల్లో రిక్రూట్ అయ్యారని, ఆరో తేదీన చేరాలని మెసేజ్ వచ్చింది. దాంతో 80 మంది నర్సులు జిల్లాల నుంచి గాంధీకి వచ్చారు. కానీ వాళ్లను పోలీసులు గేటు బయటే ఆపేశారు. రిక్రూట్మెంట్కు సంబంధించి తమకు సమాచారం లేదన్నారు. గాంధీ అధికారులూ అదే చెప్పారు. దీంతో నర్సులు ఆందోళనకు దిగారు.
ట్రాన్స్పోర్ట్ లేకున్నా తిప్పలు పడి వస్తే..
కొంత టైమ్ తర్వాత సూపరింటెండెంట్ వచ్చి ‘మీ లిస్టు ఇప్పుడే వచ్చింది. డ్యూటీలో చేరొచ్చు’ అని చెప్పారు. జీతం ఎంతని, కాంట్రాక్ట్ ఎన్ని రోజులని నర్సులు ప్రశ్నించారు. ఆఫర్ లెటర్ ఇస్తారా అని అడిగారు. దానికి సూపరింటెండెంట్ ‘మీది ఔట్ సోర్సింగ్ జాబ్, శాలరీ ఎంతో డిసైడ్ కాలేదు. ఎన్ని నెలలకోసారి జీతం ఇస్తామో చెప్పలేం. ఆఫర్ లెటర్ కూడా ఉండదు. కొవిడ్ కవరేజ్లోకీ రారు’ అనడంతో నర్సులు మండిపడ్డారు. ‘ట్రాన్స్పోర్టు లేకపోయినా అవస్థలు పడి వెహికల్స్ మాట్లాడుకొని వస్తే ఇదేం అవమానం’ అని ఆవేదన చెందారు. కొందరు ఉన్న ఉద్యోగాలు కూడా మానుకొని వచ్చామని, ఉన్నతాధికారులతోనే విషయం తేల్చుకుంటామని డీఎంఈకి వెళ్లారు.
చేస్తే చేయండి.. లేకుంటే పోండి అంటరా?
జాబ్స్ విషయమై డీఎంఈ దగ్గర నర్సులు ఆందోళనకు దిగారు. అక్కడి వచ్చిన డీఎంఈ అధికారులూ గాంధీ దగ్గర చెప్పిందే చెప్పారు. ‘‘వైరస్ బారిన పడుతామనే రిస్క్ ఉన్నా జాబ్కు సిద్ధమయ్యాం. కాంట్రాక్ట్ బేస్లో అయితే కనీస సెక్యూరిటీ ఉంటుంది. కొవిడ్ కవరేజ్లోకి కూడా రాకపోతే, జీతమెంతో చెప్పకపోతే జాబెందుకు చేయాలి? చేస్తే చెయ్యండి లేకపోతే పోండి అని అధికారులు అంటున్నారు. అలాంటప్పుడు ఎందుకు మెసేజ్లు పంపారు. ఇట్లా ఎందుకు అవమానిస్తున్నారు’ అని జాబ్కు అప్లై చేసుకున్న పల్లవి నిలదీశారు. నాలుగైదు వేలు ఖర్చు పెట్టుకొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చామన్నారు. మంగళవారం మంత్రి ఈటల రాజేందర్ను కలిపిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో నర్సులు ఆందోళన విరమించారు. మంత్రి వద్ద విషయం తేల్చుకుంటామన్నారు.
గవర్నమెంట్ మాకిచ్చే ట్రీట్మెంట్ ఇదా?
‘నోటిఫికేషన్లో కాంట్రాక్ట్ బేస్డ్ అని చెప్పారు. ఎక్కడా ఔట్ సోర్సింగ్ అని లేదు. ఇప్పుడేమో ఆఫర్ లెటర్ ఇవ్వమంటున్నారు. జీతం, అలవెన్సులు ఎంతో చెప్పలేదు. డ్యూటీకి వస్తే అటెండెన్స్ బట్టి చూస్తమన్నారు. రేపు డ్యూటీకొచ్చినా మా డ్రెస్ మేమే కొనుక్కొని రావాలి. ఏ ఆఫర్ లెటర్ లేకుండా, జీతమెంతో తెలియకుండా, కరోనా పేషెంట్ల ట్రీట్మెంట్కు రిస్క్ చేయాలా? ఎంతో దూరం నుంచి వచ్చి రిస్క్ చేసైనా ఉద్యోగం చేద్దామనుకుంటే గవర్నమెంట్ ఇట్ల రోడ్డు మీద నిలబడ్తదా?’’
– ప్రసన్న, స్టాఫ్ నర్స్