మౌంట్ మాంగనీ: బౌలింగ్లో జాకబ్ డఫీ (5/42), అజాజ్ పటేల్ (3/23) రాణించడంతో.. సోమవారం ముగిసిన మూడో టెస్ట్లోనూ న్యూజిలాండ్ 323 రన్స్ భారీ తేడాతో వెస్టిండీస్పై విజయం సాధించింది. ఫలితంగా మూడు మ్యాచ్ల సిరీస్ను 2–0తో సొంతం చేసుకుంది. 462 రన్స్ ఛేజింగ్లో 43/0 ఓవర్నైట్ స్కోరుతో ఐదో రోజు బరిలోకి దిగిన విండీస్ రెండో ఇన్నింగ్స్లో 80.3 ఓవర్లలో 138 రన్స్కే ఆలౌటైంది. బ్రెండన్ కింగ్ (67) టాప్ స్కోరర్. ఇన్నింగ్స్లో ఏడుగురు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర చెరో వికెట్ తీశారు. డెవాన్ కాన్వేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ సిరీస్లో 23 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన డఫీ (81).. ఒకే క్యాలెండర్ ఇయర్లో 80 వికెట్లు పడగొట్టిన రిచర్డ్ హ్యాడ్లీ రికార్డును అధిగమించాడు.
డబ్ల్యూటీసీలో రెండో ప్లేస్కు కివీస్
విండీస్పై సిరీస్ గెలిచిన న్యూజిలాండ్.. వరల్డ్ టెస్ట్ ర్యాంకింగ్స్ (డబ్ల్యూటీసీ)లో రెండో ప్లేస్కు దూసుకొచ్చింది. ప్రస్తుతం కివీస్ ఖాతాలో 77.78 పీసీటీ పాయింట్లు ఉన్నాయి. ఆస్ట్రేలియా (100 పీసీటీ) టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. సౌతాఫ్రికా (75), శ్రీలంక (66.67), పాకిస్తాన్ (50) వరుసగా మూడు నుంచి ఐదు స్థానాలో ఉండగా, ఇండియా (48.15) ఆరో ప్లేస్కు పడిపోయింది.
