పెండ్లి ఊరేగింపుపై లారీ దూసుకెళ్లి ముగ్గురు మృతి

పెండ్లి ఊరేగింపుపై లారీ దూసుకెళ్లి ముగ్గురు మృతి

ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లాలో ఓ పెళ్లింట విషాదం నెలకొంది. కొద్ది నిమిషాల్లో పెళ్లి పందిరికి చేరుకుంటారనగా.. బారాత్‌ చేసుకుంటూ వెళ్తున్న పెండ్లి బృందం పైనుంచి లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మృతుల్లో పెండ్లి కొడుకు తండ్రితో పాటు మరో ఇద్దరు ఉన్నారు. వీరితో పాటు మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

మల్కాన్‌గిరి జిల్లా పంద్రిపాణి గ్రామ సర్పంచ్ శివ ఖేముంది కుమారుడికి పొరుగు ఊరి అమ్మాయితో పెండ్లి నిశ్చయమైంది. నవంబర్ 24న రాత్రి పెండ్లి జరగాల్సి ఉంది. అయితే పెండ్లి మండపానికి వెళ్లేందుకు పెండ్లి కుమారుడిని అతడి కుటుంబసభ్యులు, బంధువులు ఊరేగింపుగా బయలుదేరారు. అందరూ ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ వెళ్తున్న ఆ బారాత్‌పై సడన్‌గా లారీ దూసుకెళ్లింది. దీంతో పెండ్లి కుమారుడి తండ్రితో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరికొందరికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు మొదలుపెట్టారు. ఇప్పటికే లారీని గుర్తించి, డ్రైవర్‌‌ను అరెస్ట్ చేశామని మల్కాన్‌గిరి ఎస్పీ ప్రహ్లాద్ సహాయ్ మీనా తెలిపారు.