- వెల్లడించిన అనరాక్
న్యూఢిల్లీ : మనదేశంలోని ముఖ్యమైన ఏడు నగరాల్లో ప్రైమ్ లొకేషన్లలో ఆఫీస్ స్పేస్ల అద్దెలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో సంవత్సరానికి సగటున 7 శాతం పెరిగాయి. నెలకు చదరపు అడుగుకు రూ.83 చొప్పున నిర్మాణ వ్యయం పెరిగింది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ 2023-–24 ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్ల (ఏప్రిల్–-సెప్టెంబర్) లో రేట్ల పెరుగుదలపై రిపోర్ట్ విడుదల చేసింది. గ్రేడ్ ఏ ఆఫీసుల అద్దె విలువలు ఏడు ప్రధాన నగరాల్లో నెలకు చదరపు అడుగుకు సగటున రూ. 83 పెరగగా, ఇది సంవత్సరం క్రితం చదరపు అడుగుకు రూ. 77.5గా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగం టాప్ ఏడు నగరాల్లో వాణిజ్య ఆఫీసుల బిజినెస్ నెమ్మదించింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే కొనుగోళ్లు, నిర్మాణలు ...రెండూ చాలా వరకు నిలిచిపోయాయి.
ఏడు నగరాల్లో రేట్లు ఇలా...
1. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–-సెప్టెంబర్ కాలంలో, చెన్నైలో సగటు నెలవారీ ఆఫీసు అద్దె విలువలు సంవత్సరానికి అత్యధికంగా 10 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.68కి చేరాయి. క్రితం సంవత్సరం ఇదే కాలంలో చదరపు అడుగుకు రూ.62గా ఉంది.
2. హైదరాబాదులో అద్దె 8 శాతం పెరిగి చదరపు అడుగుకు రూ.61 నుంచి రూ.66కి చేరింది.
3. బెంగళూరు, పూణే, కోల్కతా ఆఫీసుల అద్దెల్లో ఒక్కొక్కటి 7 శాతం వార్షిక వృద్ధిని సాధించగా, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎంఎంఆర్) ఢిల్లీ-–ఎన్సీఆర్ ఒక్కొక్కటి 5 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.
4. బెంగళూరులో సగటు నెలవారీ ఆఫీసు అద్దె చదరపు అడుగుకు రూ.84 నుంచి రూ.90కి పెరిగింది.
5. పూణేలో, సగటు ఆఫీసు అద్దె నెలకు చదరపు అడుగుకు రూ. 74 నుంచి రూ. 79కి పెరిగింది, కోల్కతాలో చదరపు అడుగుకు రూ. 54 నుంచి రూ. 58కి పెరిగింది.
6. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో అద్దె చదరపు అడుగుకి రూ. 130 నుంచి 136 రూపాయలకు పెరిగింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్( ఎన్సీఆర్) లో సగటు ఆఫీసు అద్దెలు చదరపు అడుగుకు రూ. 81 నుంచి రూ. 85కి పెరిగాయి.