
- కోల్డ్ స్టోరేజీలకు ఇన్ చార్జ్ లుగా సెక్యూరిటీ గార్డ్ లు, వాచ్మెన్లు
- కిందిస్థాయి ఔట్ సోర్సింగ్ సిబ్బందికి డ్యూటీలు వేసి దందా
- రికార్డులపై సంతకాలకే పరిమితమైన మార్కెటింగ్ ఆఫీసర్లు
ఖమ్మం/ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం మిర్చి మార్కెట్ లో జీరో అమ్మకాలు, ఆర్డీ(రేట్ డిఫరెన్స్) దందాను అడ్డుకునేందుకు మంత్రి ఆశయానికి ఆఫీసర్లే గండి కొడుతున్నారు. ఖమ్మంలోని కోల్డ్ స్టోరేజీల్లో అక్రమాలకు చెక్పెట్టేందుకు మార్కెటింగ్ అధికారులను ఇన్ చార్జ్ లుగా నియమించాలని మంత్రి ఆదేశించారు. వాటిని పాటించకుండా ఔట్ సోర్సింగ్ కిందిస్థాయి సెక్యూరిటీ గార్డులు, వాచ్మెన్లు, అటెండర్లను నియమించి దందాను కొనసాగిస్తుండడంతో తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
ఖమ్మంలోని మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్ పరిధిలో 24 కోల్డ్ స్టోరేజీలు, ఖమ్మం జిల్లా మార్కెటింగ్ శాఖలో 20 మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. వీరిని ఇన్ చార్జ్ లుగా ఉన్నతాధికారులు నియమించలేదు. ఖమ్మం మార్కెట్ లోని ఔట్ సోర్సింగ్ సిబ్బంది 15 మందికి డ్యూటీలు వేశారు. వీరిలో నలుగురు సెక్యూరిటీ గార్డులు, నలుగురు డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ముగ్గురు వాచ్మెన్లు, ఒక అటెండర్ఉన్నారు.
ఆఫీసర్ల పనిలో ఇన్ చార్జ్ లు
కోల్డ్ స్టోరేజీలో అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు మార్కెటింగ్ ఆఫీసర్లను ఇన్ చార్జ్ లుగా నియమించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. అందుకు విరుద్ధంగా ఆ శాఖ ఉన్నతాధికారులు ఔట్ సోర్సింగ్ సిబ్బందికి బాధ్యతలు అప్పగించారు. కోల్డ్ స్టోరేజీల్లో జరిగే అమ్మకాలతో పాటు దడువాయిలు పీవోఎస్మెషీన్లలో ఎంట్రీ వివరాలను సరిచూడడం వీరి బాధ్యతగా ఉంది.
అయితే.. బిడ్డింగ్ వివరాలను కూడా ఔట్ సోర్సింగ్ సిబ్బందే ఆఫీసుకు తీసుకొస్తుండగా.. రికార్డులపై సంతకాలు పెట్టడానికే అసిస్టెంట్ సెక్రటరీలు పరిమితమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. మంత్రి ఆదేశాలను బేఖాతర్ చేస్తూ, రెగ్యులర్ ఉద్యోగులు తక్కువ గా ఉన్నారనే సాకుతో .. కింది స్థాయి సిబ్బంది నియమించడంపైనా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎర్ర మిర్చిని తాలుగా చూపెడుతూ ఆర్డీ దందాను మళ్లీ కంటిన్యూ చేస్తున్నారని తెలుస్తోంది. ఇన్నేండ్లుగా ఆఫీసర్లను మేనేజ్చేస్తున్న కోల్డ్ స్టోరేజీల ఓనర్లు.. ఔట్సోర్సింగ్ సిబ్బందిని మేనేజ్చేయలేరా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆర్డీ దందా ఇలా..!
రైతుల నుంచి కొనుగోలు చేసిన నాణ్యమైన మిర్చిని రికార్డుల్లో తాలు మిర్చిగా ఎంట్రీ చేసి తక్కువ రేటుకు కొన్నట్టుగా మేనేజ్చేస్తున్నారు. దీన్నే స్థానిక వ్యాపారులు ఆర్డీగా కోడ్ భాషలో చెబుతుంటారు. దీని ద్వారా సర్కార్ కు మార్కెట్ సెస్, ట్యాక్స్లను ఎగ్గొడుతున్నారనే ఫిర్యాదులు ఉన్నాయి. ప్రతి సీజన్లో రూ.కోట్లలో వ్యాపారులు చేస్తున్న ఈ దందాలో మిర్చి కాంటా వేసే దడువాయిలు కీలకపాత్ర పోషిస్తున్నారు.
ఇందుకు మార్కెటింగ్ ఆఫీసర్లు, సిబ్బంది అవినీతికి పాల్పడుతూ వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కొద్దినెలల కింద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి వెళ్లడంతో ఉన్నతాధికారులను మందలించారు. మళ్లీ రిపీట్ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయికూడా పలుమార్లు ఖమ్మం మార్కెట్ను సందర్శించి అధికారులు, వ్యాపారులతో సమావేశమయ్యారు.
కోల్డ్ స్టోరేజీల్లోని మిర్చి అమ్మకాల్లో అక్రమాలకు జరగకుండా మార్కెటింగ్ శాఖ అధికారులకు డ్యూటీలు వేయాలని ఆమె ఆదేశించారు. అయితే ..ఉన్నతాధికారులు లైట్ తీసుకొని, కింది స్థాయి ఔట్ సోర్సింగ్ సిబ్బందికి బాధ్యతలు ఇచ్చి.. ఆర్డీ దందాను కంటిన్యూ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అక్రమాలు జరగకుండా చూస్తున్నాం
కోల్డ్ స్టోరేజీలకు ఇన్ చార్జ్ లుగా రెగ్యులర్సిబ్బందితో పాటు ఔట్సోర్సింగ్ సిబ్బందికి కూడా డ్యూటీలు వేశాం. డిపార్ట్ మెంట్ లో 20 మంది రెగ్యులర్స్టాఫ్ఉన్నారు. కోల్డ్ స్టోరేజీల వద్ద వేమెంట్ సరిగా జరుగుతుందా లేదా చూడడం, పీవోఎస్మెషీన్లలో ఎంట్రీలను చెక్ చేయడం, ఎన్ని బస్తాలు అమ్మారు, ఎంట్రీ చేశారా లేదా, శాంపిల్ కు వచ్చిన వెరైటీనే అమ్ముతున్నారా.. ఇలా అన్నింటినీ ఇన్ చార్జ్ చెక్చేస్తారు. రెగ్యులర్సిబ్బందికి అసిస్టెంట్లుగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని వినియోగించుకుంటున్నాం. - ఎంఏ అలీం, ఖమ్మం జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో గేట్ వద్ద సెక్యూరిటీ గార్డు రెంటాల వెంకన్నను కృష్ణ సాయి కోల్డ్ స్టోరేజీకి ఇన్ చార్జ్ గా నియమించారు. ప్రతి రోజూ కోల్డ్ స్టోరేజీకి వెళ్లి డ్యూటీలో ఉన్నట్టుగా ఫొటో తీసుకొని వాట్సప్ గ్రూపులో ఫార్వర్డ్ చేస్తున్నాడు.