అధికారులు సీఎం ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారు

అధికారులు సీఎం ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారు


పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'చలో రాజ్‌భవన్‌' కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఇందిరా పార్క్ దగ్గరకు వచ్చిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందిరా పార్క్ దగ్గర జరిగిన సమావేశంలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. కార్యకర్తలతో కలిసి రాజ్ భవన్ వైపు పాదయాత్రగా బయలుదేరారు. ఇదే సమయంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి అక్కడినుంచి తీసుకెళ్లారు.

రేవంత్ ను అరెస్ట్ చేసే సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. రేవంత్ అరెస్ట్ ను ఖండిస్తూ కాంగ్రెస్ కార్యాకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొందరు రేవంత్ తీసుకెళ్తున్న వాహనం వెంట వెళ్లారు. ఈ క్రమంలోనే పోలీసులు కాంగ్రెస్ నాయకులు అంజనీ కుమార్ యాదవ్, మల్ రెడ్డి రాం రెడ్డి,  అనిల్ కుమార్ యాదవ్, మానవతారాయ్ లను అరెస్ట్ చేసి అంబర్ పేట స్టేషన్ కు తరలించారు. జిల్లాల్లోనూ చాలా మంది కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టులు చేశారు.
కాంగ్రెస్ నాయకులను బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రకమైన అరెస్టులు చేసి పోలీసులతో పరిపాలన చేయాలని సీఎం కేసీఆర్ అనుకుంటే తీవ్రమైన పరిణామలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. అధికారులు సీఎం ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తే.. ఎవరినీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాము చేస్తున్న కార్యక్రమం ప్రజల కోసమని చెప్పారు.