పిల్లలకు టీకాలు వేశాకే ఆఫ్‌లైన్ పాఠాలు

పిల్లలకు టీకాలు వేశాకే ఆఫ్‌లైన్ పాఠాలు
  • ఈసారీ ఆన్‌లైన్‌ సదువులేనా
  • థర్డ్ వేవ్ పిల్లలపై ఎక్కువనే ప్రచారంతో సర్కారు అలర్ట్‌
  • పిల్లలకు టీకా వేసే వరకూ ఆన్‌లైనే బెటరనుకుంటున్న అధికారులు
  • జూన్ 3వ వారం నుంచి అకడమిక్ ఇయర్ ప్రారంభానికి ఏర్పాట్లు
  • ఆన్‌లైన్‌లో క్లాసులు స్టార్ట్‌ చేయాలని ప్రాథమికంగా నిర్ణయం
  • థర్డ్‌ వేవ్‌ రాకుంటే 3,4 నెలల్లో ఫిజికల్‌ క్లాసులు స్టార్ట్‌ చేసేలా ప్లాన్‌ 

హైదరాబాద్, వెలుగు: వచ్చే అకడమిక్ ఇయర్​పైనా కరోనా ప్రభావం పడుతోంది. ఈ యేడాదంతా ఆన్‌లైన్ పాఠాలతోనే నడిచిన స్కూళ్లు.. ఇక ముందూ అదే బాటలో కొనసాగేలా కనిపిస్తోంది. కరోనా థర్డ్‌ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందని ఎక్స్‌పర్ట్స్‌ చెబుతుండటంతో పిల్లలందరికీ టీకాలు వేసే వరకూ ఆన్‌ లైన్​క్లాసులు నిర్వహించడమే బెటరని విద్యా శాఖ, సర్కారు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఐతే సెకండ్ వేవ్ తగ్గి థర్డ్ వేవ్ రాకుంటే 3, 4  నెలల్లో ఫిజికల్ క్లాసులు స్టార్ట్‌ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు.

మే 31 వరకు సెలవులు
స్టేట్‌‌లోని 40,898 స్కూళ్లలో 59,26,253 మంది స్టూడెంట్లు చదువుతున్నారు. 2020–21 విద్యాసంవత్సరం జూన్‌‌లో స్టార్ట్ కావాల్సి ఉండగా ఆన్​లైన్, టీవీ పాఠాలతో సెప్టెంబర్‌‌లో మొదలైంది. టీశాట్, దూరదర్శన్​ ద్వారా మూడో తరగతి నుంచి పదో తరగతి వరకూ క్లాసులు నిర్వహించారు. కరోనా తీవ్రత తగ్గడంతో ఫిబ్రవరి నెలలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు రెండు దశల్లో ఫిజికల్ క్లాసులు ప్రారంభించారు. అయితే కరోనా సెకండ్ వేవ్‌తో మార్చి నెలాఖరు నుంచి ఫిజికల్ క్లాసులు బంద్‌‌ చేశారు. దీంతో స్టూడెంట్లందరినీ పాస్ చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మే31 వరకు వేసవి సెలవులు ఇచ్చింది.

కొంతకాలం ఆన్​లైన్ క్లాసులే
రెగ్యులర్ అకడమిక్ క్యాలెండర్ షెడ్యూల్ ప్రకారం వేసవి సెలవుల తర్వాతి రోజు నుంచి స్టార్ట్‌‌ కావాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మరో రెండు వారాలు సెలవులు కొనసాగించే అవకాశముంది. జూన్ మూడోవారం నుంచి కొత్త అకడమిక్ ఇయర్ (2021–22) స్టార్ట్​ చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ఈ యేడాది మాదిరిగానే వచ్చే ఏడాదీ ఆన్​లైన్ పాఠాలతోనే అకడమిక్ ఇయర్ స్టార్ట్‌‌ చేయాలని ప్రైమరీగా నిర్ణయం తీసుకున్నారు. దీనికి అనుగుణంగా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ‘సైట్’ రూపొందించిన ఆన్​లైన్ పాఠాలు రెడీగా ఉన్నాయి. గతేడాది రికార్డు చేయని కొన్ని పాఠాలను ఈ యేడాది పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర విద్యా శాఖ కూడా అకడమిక్ ఇయర్ ప్రారంభంపై రాష్ర్టాల అభిప్రాయాలు, పనుల గురించి తెలుసుకుంది. ఆన్​లైన్​పాఠాలు చెప్పేందుకు తాము రెడీగా ఉన్నామని రాష్ట్ర విద్యా శాఖ స్పష్టం చేసింది. త్వరలో కేంద్రం నుంచి గైడ్​లైన్స్ వస్తాయని, ఆ ప్రకారం ప్లాన్ రూపొందించుకోవాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి సూచించారు. దీంతో ఆన్​లైన్ క్లాసులే కొంతకాలం కొనసాగించాలని సర్కారు భావిస్తోంది.

టీకాలు వేశాకే ఆఫ్‌లైన్ పాఠాలు 
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందని ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెబుతుండటంతో చిన్నారులకు టీకాలు వేయించాకే ఆఫ్ లైన్ క్లాసులు నిర్వహిస్తే మంచిదని టీచర్లు, పేరెంట్స్‌‌ అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం పిల్లలపై టీకా ట్రయల్స్​కొనసాగుతున్నందున.. అవి మరింత ఆలస్యమైతే ఎలా అని ఆఫీసర్లు ఆలోచిస్తున్నారు. సెకండ్ వేవ్ పూర్తిగా తగ్గి థర్డ్ వేవ్ రాకపోతే జాగ్రత్తలతో 3, 4 నెలల్లో ఆఫ్​లైన్ క్లాసులు ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఇలా రెండు రకాల ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తున్నారు.