ఐపీఎల్ మ్యాచ్ దృష్ట్యా.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. 

ఐపీఎల్ మ్యాచ్ దృష్ట్యా.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. 

ఏప్రిల్ 9వ తేదీన ఆదివారం హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లు జరుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. 

ఈ మ్యాచ్ దృష్ట్యా, ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపు ఉంటాయని రాచకొండ పోలీసులు చెప్పారు. ఉప్పల్ స్టేడియానికి వచ్చే నాలుగు ప్రధాన మార్గాల్లో వాహనాలను అనుమతిస్తామన్నారు. అయితే భారీ వాహనాలకు మాత్రం ఉప్పల్ స్డేడియం వైపు అనుమతి లేదని తెలిపారు.  ఆదివారం మధ్యాహ్నం 3:30 నుండి రాత్రి 11:30 గంటల మధ్య కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేస్తున్నట్లు నోటీసులు జారీ చేశారు. 

వరంగల్ హైవే నుంచి చెంగిచెర్ల వైపు వెళ్లే వాహనాలను చెంగిచెర్ల ఎక్స్ రోడ్డు–చెర్లపల్లి–ఐఓసీఎల్–ఎన్‌ఎఫ్‌సీ రోడ్డు వైపు మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఎల్‌బీనగర్‌ నుంచి నాగోల్‌ వైపు వెళ్లే ఈ వాహనాలను.. నాగోల్‌ మెట్రో స్టేషన్‌ వైపు నుంచి హెచ్‌ఎండీఏ–బోడుప్పల్‌–చెంగిచెర్ల ఎక్స్‌ రోడ్డు మీదుగా, మల్లాపూర్‌ నుంచి నాచారం ఐడీఏ వైపు వెళ్లే భారీ వాహనాలను.. నాచారం ఐడీఏ నుంచి చెర్లపల్లి–చెంగిచెర్ల మీదుగా మళ్లించనున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని వాహనదారులు ప్రత్యామ్నయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.

ఐపీఎల్ 16  సీజన్ లో ఉప్పల్ స్టేడియంలో మొత్తం ఏడు ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. ఇప్పటికే ఒక మ్యాచ్ జరిగింది.. రెండో మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఇక 2019 తర్వాత హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ నిర్వహిస్తున్నారు.