ఈ నెల 13న బీసీల పార్లమెంటు ముట్టడి : ఆర్. కృష్ణయ్య

ఈ నెల 13న బీసీల పార్లమెంటు ముట్టడి : ఆర్. కృష్ణయ్య

బషీర్ బాగ్, వెలుగు: పార్లమెంట్‌‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల13,14  తేదీల్లో వేలాది మందితో చలో ఢిల్లీ, పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య అన్నారు.  బీసీ బిల్లు పార్లమెంట్‌‌లో ఆమోదం చేసి అసెంబ్లీ,  పార్లమెంట్ ఎన్నికల్లో  బీసీలకు 50  శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.  బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన శనివారం కాచిగూడలో నిర్వహించిన సమావేశంలో  ఆర్. కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. 

బీసీల డిమాండ్ల సాధనకై పార్లమెంట్ ముందు భారీ ప్రదర్శన నిర్వహిస్తామని, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, ప్రతిపక్ష పార్టీల నేతలు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులను కలిసి పార్లమెంట్‌‌లో బీసీ బిల్లు పెట్టించడానికి ఒత్తిడి తెస్తామని ఆయన తెలిపారు.  దేశ జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.  కార్యక్రమంలో బీసీ హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బొల్లు మహేందర్,  నీలం వెంకటేశ్, నందగోపాల్,  తదితరులు పాల్గొన్నారు.