- నిర్వహణకు 124 మంది పీఈటీలకు డ్యూటీలు
- అధికారికంగా ఆదేశాలు జారీ చేసిన డీఈఓ
- ఆఫీసర్ల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు
- ఇప్పటికే యువతకు స్పోర్ట్స్ కిట్లు పంచిన జగదీశ్ రెడ్డి
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట జిల్లాలో మంత్రి జగదీశ్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా ఆటల పోటీల నిర్వహణ కోసం నెలరోజుల పాటు ప్రభుత్వ పీఈటీలకు డ్యూటీలు వేశారు. ఈ నెల 18న మంత్రి జగదీశ్ రెడ్డి పుట్టినరోజు సందర్బంగా జూన్ 23 నుంచి ఈ నెల 18 వరకు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో యువత, మహిళలకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. మహిళలకు చెస్, క్యారమ్, బ్యాడ్మింటన్, ఖోఖో, రింగ్ బాల్ గేమ్స్, ముగ్గుల పోటీలు, పురుషులకు కబడ్డీ, క్రికెట్, వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని మహిళలకు, యువతకు మంత్రి నెల రోజల ముందే క్రికెట్ కిట్లు, బ్యాడ్మింటన్, వాలీబాల్ కిట్లు, క్యారమ్ బోర్డులను పంపిణీ చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీల నిర్వహణ కోసం జిల్లాలోని 124 మంది పీఈటీ, ఫిజికల్ డైరెక్టర్, స్కూల్ అసిస్టెంట్లను డిప్యూటేషన్ పై సూర్యాపేట నియోజకవర్గానికి కేటాయిస్తూ డీఈఓ అశోక్ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 23 నుంచి ఈ నెల 18 వరకు వారికి సూర్యాపేటలో డ్యూటీ వేశారు.
జగదీశన్న కప్ పేరిట ఎన్నికల ‘గేమ్స్’
అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల గడువు మాత్రమే ఉండడంతో మంత్రి జగదీశ్ రెడ్డి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాలు చేపడుతన్నారు. యువత, మహిళలను ఆకట్టుకోవడానికి స్పోర్ట్స్ కిట్లను పంచారు. తన పుట్టినరోజు సందర్బంగా జగదీశన్న కప్ పేరిట పోటీలు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజల్లో తనపై పెరిగిన వ్యతిరేకత తగ్గించడంతో పాటు పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రి ప్లాన్ చేశారు. ఈ పోటీలకు ప్రభుత్వ పీఈటీలను, ఫిజికల్ డైరెక్టర్లను నియమిస్తూ అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. రాజకీయ పార్టీ కార్యక్రమం కోసం ప్రభుత్వ ఉద్యోగులకు డ్యూటీ ఎలా వేస్తారని పలువురు విమర్శిస్తున్నారు. మరోపక్క పీఈటీలను డిప్యూటేషన్ పై పంపడంతో స్కూళ్లలో స్టూడెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.