ఉమెన్స్ డే సందర్భంగా ఆడబిడ్డలకు కానుక 

ఉమెన్స్ డే సందర్భంగా ఆడబిడ్డలకు కానుక 

ఉమెన్స్ డే సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వం ఆడబిడ్డలకు కానుక ప్రకటించింది. 2022--23 ఆర్థిక సంవత్సరానికి వడ్డీలేని రుణాల కోసం రూ.750 కోట్లను విడుదల చేసింది. ఇందులో గ్రామీణ స్వయం సహాయక సంఘాలకు రూ.500 కోట్లు, పట్టణ సంఘాలకు రూ.250 కోట్లు విడుదల చేయనున్నారు. గ్రామాల్లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) ద్వారా, పట్టణాలు, నగరాల్లో మెప్మా ద్వారా ఈ పథకాన్ని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 4,31,025 సంఘాలు ఉన్నాయి. వాటిలో 46,10,504 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. గత ఎనిమిదేళ్లలో రాష్ట్రంలోని వివిధ బ్యాంకుల ద్వారా రూ.66,624 కోట్లను మహిళా సంఘాలు రుణాలుగా పొందాయి.

వ్యవసాయం, పాడి పరిశ్రమ, వ్యాపారం, స్వయం ఉపాధి, పేదరిక నిర్మూలన కార్యకలాపాల కోసం తీసుకునే రుణాలను సకాలంలో వడ్డీతో సహా బ్యాంకులకు చెల్లిస్తే... ప్రభుత్వం ప్రోత్సాహకంగా వడ్డీ మొత్తాన్ని తిరిగి ఆయా సంఘాలకు అందిస్తోంది. తాజాగా రూ.750 కోట్ల విడుదల చేయడం ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు రూ.2561.77 కోట్లకు చేరాయి. మహిళలకు మేలు జరిగేలా పెద్ద మొత్తంలో నిధులను విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధన్యవాదాలు తెలిపారు.