ఎదురుకాల్పుల్లో జవాను మృతి

ఎదురుకాల్పుల్లో జవాను మృతి

దొడ/జమ్మూ: జమ్మూకాశ్మీర్ లో జరిగిన టెర్రరిస్టుల దాడిలో ఆర్మీ జవాను మృతిచెందారు. ఆదివారం ఉదయం దొడ జిల్లాలోని ఒక గ్రామంలో టెర్రరిస్టులతో కొనసాగుతున్న కాల్పుల్లో ఆర్మీ జవాను అమరుడయ్యాడని అధికారులు తెలిపారు. కొంతమంది టెర్రరిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో దొడ పట్టణానికి 26 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండానా ప్రాంతంలోని పోస్టా-పోట్రా గ్రామంలో రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్పీఎఫ్ బలగాలు, జమ్మూ పోలీసులు శనివారం రాత్రి ఆపరేషన్ చేపట్టారు. బలగాలు చుట్టుముట్టగా టెర్రరిస్టులు కాల్పులు జరిపారని, ఎదురుకాల్పుల్లో జవాను అమరుడయ్యాడని తెలిపారు. ఈ ఎన్​కౌంటర్​లో హిజ్బుల్ ముజాహిద్దీన్ టెర్రరిస్టు ఒకరిని సైనికులు మట్టుబెట్టగా.. మరొకరు అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ హిజ్బుల్ ముజాహిద్దీన్ గ్రూప్ కు చెందినవారుగా అధికారులు అనుమానిస్తున్నారు.