- 8 కోట్లకు చేరిన మొత్తం రిజిస్టర్డ్ అకౌంట్లు
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లపై జనానికి క్రేజ్ పెరుగుతోంది. కేవలం 107 రోజుల్లోనే కొత్తగా కోటి అకౌంట్లు బీఎస్ఈలో రిజిస్టర్ అయ్యాయి. దీంతో బీఎస్ఈలో రిజిస్టర్ అయిన మొత్తం అకౌంట్ల సంఖ్య ఎనిమిది కోట్లకు పెరిగింది. కాగా, డీమాట్ అకౌంట్లను ఓపెన్ చేసుకున్న తర్వాత ట్రేడ్ లేదా ఇన్వెస్ట్ చేయడానికి బీఎస్ఈ లేదా ఎన్ఎస్ఈలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఏడాది జూన్ 6 నుంచి సెప్టెంబర్ 21 మధ్య కొత్తగా కోటి ఇన్వెస్టర్ అకౌంట్లు రిజిస్టర్ అయ్యాయని బీఎస్ఈ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. తమ వద్ద రిజిస్టర్ చేసుకున్న ఇన్వెస్టర్ల సంఖ్య ఏడు కోట్లను క్రాస్ చేసిందని ఈ ఏడాది జూన్ 6 న బీఎస్ఈ ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటికే కేవలం 12 నెలల్లోనే (మే 23, 2020 నుంచి) రెండు కోట్ల మంది ఇన్వెస్టర్ అకౌంట్లు బీఎస్ఈలో రిజిస్టర్ అయ్యాయి. కేవలం 107 రోజుల్లోనే ( మూడు నెలల్లో) నే కోటి అకౌంట్లు బీఎస్ఈలో రిజిస్టర్ అవ్వడం ఇదే మొదటి సారి. గత ఏడాది కాలం నుంచి డైరెక్ట్గా లేదా మ్యూచువల్ఫండ్స్ ద్వారా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్లకు ఆదరణ పెరుగుతోందని బీఎస్ఈ ఎండీ ఆశిష్కుమార్ చౌహాన్ పేర్కొన్నారు. గ్లోబల్గా ఇదే ట్రెండ్ కొనసాగుతోందని చెప్పారు. మార్కెట్లో ఎంటర్ అయిన ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని ఆశిష్కుమార్ చౌహాన్ సలహాయిచ్చారు.
బీఎస్ఈ అకౌంట్లు ఇలా పెరిగాయి..
2008 నాటికి బీఎస్ఈలో రిజిస్టర్ అయిన అకౌంట్ల సంఖ్య కేవలం కోటి మాత్రమేనని చెప్పిన ఆయన, జులై 2011 నాటికి రెండు కోట్లకు పెరిగిందని అన్నారు. ‘మూడు కోట్లకు చేరుకోవడానికి బీఎస్ఈ మరో మూడేళ్లు తీసుకుంది. 2014, జనవరిలో ఈ మైలురాయిని అందుకుంది. నాలుగు కోట్ల మైలురాయిని 2018, ఆగస్ట్లో చేరుకుంది’ అని చౌహన్ గుర్తు చేశారు. బీఎస్ఈలో రిజిస్టర్ అయిన ఇన్వెస్టర్ అకౌంట్లు 2020, మే లో ఐదు కోట్ల మార్క్ను, ఈ ఏడాది జనవరి 19 న ఆరు కోట్ల మార్క్ను క్రాస్ చేసింది. ఏడు కోట్ల మార్క్ను జూన్ 6 ను చేరుకోగలిగింది.