కరోనాతో నిమిషానికి ఒకరు.. గంటకు 70కి పైగా మరణాలు

కరోనాతో నిమిషానికి ఒకరు.. గంటకు 70కి పైగా మరణాలు
  • మూడు రోజులుగా  గంటకు 10 వేలపైనే కేసులు
  • 20 లక్షలు దాటిన యాక్టివ్ కేసులు
  • 2,59,170 కొత్త కేసులు, 1,761 డెత్స్
  • 85.56 శాతానికి రికవరీ రేటు డౌన్​

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ముంచెత్తుతోంది. లక్షల మందికి సోకుతోంది. రోజూ వందల మంది చనిపోతున్నారు. గత ఆదివారం నుంచి నిమిషానికి ఒకరు చనిపోతున్నారు. గంటకు 10 వేలకు పైగా  కేసులు నమోదవుతున్నాయని హెల్త్ మినిస్ట్రీ డేటా వెల్లడిస్తోంది. రోజురోజుకూ ఈ సంఖ్య పెరుగుతోంది. ఏప్రిల్ 1న గంటకు 3 వేల కేసులు, 19 డెత్స్ నమోదు కాగా.. ఆదివారం నాటికి గంటకు 10,895 కేసులు, 62 మరణాలు రికార్డయ్యాయి. సోమవారం నాటికి గంటకు 11,408 కేసులు, 67 మరణాలు నమోదయ్యాయి. మంగళవారం ఏకంగా గంటకు 73 మంది చనిపోయారు.

2,59,170 కొత్త కేసులు
మంగళవారం 2,59,170 కొత్త కేసులు వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,53,21,089కి పెరిగింది. యాక్టివ్ కేసులు 20 లక్షలు దాటాయి. 24 గంటల వ్యవధిలో 1,761 మంది చనిపోయారు. ఇప్పటిదాకా మొత్తం 1,80,530 మంది మరణించారు. వరుసగా 41వ రోజు కూడా యాక్టివ్ కేసులు పెరిగాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 13.26 శాతానికి చేరగా.. రికవరీ రేటు 85.56 శాతానికి పడిపోయింది. ఇప్పటిదాకా 26,94,14,035 టెస్టులు చేశామని, సోమవారం ఒక్కరోజే 15,19,486  శాంపిల్స్ పరీక్షించామని ఐసీఎంఆర్ చెప్పింది.

16 శాతం పాజిటివిటీ రేటు
మహారాష్ట్ర, ఢిల్లీ సహా 10 రాష్ట్రాల్లోనే 77.67 శాతం కొత్త కేసులు నమోదవు తున్నాయి. డైలీ పాజిటివిటీ రేటు పెరుగుతోంది. ప్రస్తుతం 15.99 శాతంగా ఉంది. మహారాష్ట్ర, చత్తీస్​గఢ్, యూపీ, కర్నాటక, కేరళ రాష్ట్రాల్లోనే 62.07% కొత్త కేసులు నమోదవుతున్నాయి. పది రాష్ట్రాల్లోనే 82.74 % కొత్త డెత్స్ రికార్డవుతున్నాయి. మంగళవారం మహారాష్ట్రలో 351 మంది, చత్తీస్​గఢ్​లో 240 మంది చనిపోయారు. ఇప్పటిదాకా 13 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ పూర్తయింది. మొత్తం డోసుల్లో 60% 8 రాష్ట్రాల్లోనే పంపిణీ జరిగింది.