ఉద్యోగులకు షాక్ ఇస్తున్న కంపెనీలు.. రాత్రికి రాత్రే టర్మినేషన్ లెటర్లు

ఉద్యోగులకు షాక్ ఇస్తున్న కంపెనీలు.. రాత్రికి రాత్రే టర్మినేషన్ లెటర్లు

లక్ష ఐటీ జాబ్స్ కోత!

రెండు రోజుల్లో వెయ్యి మందికి టర్మినేషన్ లెటర్లు
‘ఇకపై మా కంపెనీ ఎంప్లాయ్స్ కాదు’ అంటూ మెయిల్స్
మార్చ్ జీతం ఇచ్చి సాగనంపుతున్న కంపెనీలు
ప్రాజెక్టులు లేవన్న కారణంతో భారీగా తొలగింపు

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ లోని సాఫ్ట్ వేర్ జాబ్స్ పై కరోనా వైరస్ ఎఫెక్ట్ పడింది. ఐటీ కంపెనీలు టెక్కీలకు పింక్ స్లిప్స్ పంపుతున్నాయి. ప్రస్తుత ప్రాజెక్టు పూర్తయిందని, ఇక కొత్త ప్రాజెక్టు లేదని టర్మినేషన్ లెటరను ఎంప్లాయిస్ కు మెయిల్ చేస్తున్నాయి. ఈ రెండు రోజుల్లో దాదాపు 1,000 మందిని ఉద్యోగం నుంచి తొలగించినట్టు సాఫ్ట్ వేర్ సెక్టార్ ఎక్స్ పర్టులు చెబుతున్నారు. భవిష్యత్ లో ఈ సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏప్రిల్ ఆఖరుకు దాదాపు లక్ష మంది ఉద్యోగాలకు ఎసరు తప్పదని అంటున్నారు. హైదరాబాద్ కేంద్రంగా దాదాపు 1,500 సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఐదున్నర లక్షల మందికిపైగా పని చేస్తున్నారు. అమెరికాలో కరోనా విజృంభణ నేపథ్యంలో మన దేశం నుంచి యూఎస్ కు సాఫ్ట్ వేర్ సర్వీసులు అందించే కంపెనీలు సంకటంలో పడ్డాయి. అక్కడి నుంచి కొత్తగా ఎలాంటి ప్రాజెక్టులు రావడం లేదు. భవిష్యత్ లో ప్రాజెక్టులు వస్తాయో లేదో తెలియని అయోమయ పరిస్థితి . కొత్త ప్రాజెక్టులు వచ్చే వరకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం తలకు మించిన భారంగా చాలా సంస్థలు భావిస్తున్నాయి. దీంతో ఎంప్లాయిస్ ను వదిలించుకునే పనిలో పడ్డాయి. ప్రస్తుంతం కొనసాగుతున్న ప్రాజెక్టుకు కావాల్సిన టెక్కీలను
ఉంచుకుని మిగతా వారిని ఇంటికి పంపిస్తున్నాయి.

జీతం ఇచ్చిన మరుసటి రోజు నుంచే..
హైదరాబాద్ దాదాపు వెయ్యి మంది సాఫ్ట్ వేర్లకు ఈ 2 రోజుల్లో టర్మినేషన్ లెటర్లు పంపినట్టు ప్రచారం జరుగుతోంది. మార్చ్ నెల జీతం అందిన మరుసటి రోజు కంపెనీల నుంచి చాలా మందికి మెయిల్స్ వెళ్లాయి. ‘‘కొత్త ప్రాజెక్టులు లేవు. ఇక నుంచి మీరు మా కంపెనీ ఉద్యోగస్తులు కాదు. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత ఆఫీసుకు వచ్చి సెటిల్ చేసుకోండి’ అన్నది మెయిల్స్ సారాంశం. సడెన్ గా ఉద్యోగం పోతే ఏం చేయాలో తెలియని అయోమయంలో టెక్కీలు పడ్డారు .

క్యాంపస్ ప్లేస్ మెంట్లకు బ్రేక్
కరోనా వైరస్ ప్రభావం క్యాంపస్ ఇంటర్వ్యూలపై పడింది. ఇంటర్వ్యూల్లో సెలక్ట్ అయిన వారికి ఆఫర్ లెటర్లు ఇవ్వడం లేదు. ఇప్పటికే ఆఫర్ లెటర్లు
పంపినా.. వారికి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. అసలు ఉద్యోగంలో జాయిన్ చేసుకుంటారా? లేదా? అనే క్లారిటీ ఇవ్వడం లేదు. ఆఫర్ లెటర్లు అందుకున్న కొందరు ప్రెషర్స్ ఫోన్ చేస్తే.. ‘మేమే మీకు కాల్ చేస్తాం. ఎప్పుడు రావాలో డీటెయిల్స్ పంపుతాం’ అని చెప్పినట్లు ఓ ఇంజనీరింగ్ స్టూడెంట్ చెప్పాడు.

కొత్త ప్రాజెక్టుకు పంపుతామని చెప్పి..
లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి వర్క్ ఫ్రం హోం చేస్తున్నా. ఈ నెల 2నుంచి ఎలాంటి వర్క్ ఇవ్వడంలేదు.తర్వాత కంపెనీతో నా యాక్సెస్
కట్ చేశారు. ఎందుకని అడిగితే.. ‘ప్రాజెక్టు పూర్తయింది. కొత్త ప్రాజెక్టుకు పంపుతాం’అని చెప్పారు. కాని మరుసటి రోజే టర్మినేషన్ లెటర్ వచ్చింది.
– సతీశ్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్

ఐదేండ్ల నుంచి పనిచేస్తున్నా..కానీ
యూఎస్ బేస్డ్ కంపెనీ కదా అని వేరే ఆఫర్ వచ్చినా వెళ్లలేదు. 5 ఏండ్లుగా పనిచేస్తున్నా. కాని మొన్న రాత్రి ఉద్యోగం నుంచి తొలగిస్తునట్టు మెయిలొచ్చింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్లి మళ్లీ జాబ్ కోసం ట్రై చేయాలో అర్థం కావడం లేదు. కంపెనీ ఇచ్చే బెసిక్పే మా కుటుంబం గడవడానికి సరిపోదు. -శ్రీకాంత్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్

మిడ్ నైట్ మెయిల్ పంపారు..
లాక్డౌన్ ప్రకటించగానే.. జనగామ దగ్గర్లోని మా ఊరికి వచ్చాను. ఇంటి నుంచే పనిచేస్తున్నా. మార్చి 30న జీతం పడింది. ఏప్రిల్ 2వ తేదీ మిడ్ నైట్ కంపెనీ నుంచి మెయిల్ వచ్చింది. ఉద్యోగం నుంచి తొలగించామని చెప్పారు. -శ్రీను, సాఫ్ట్ వేర్ ఇంజనీర్

For More News..

న్యూస్ చానల్సే మస్తు చూస్తున్రు