బకెట్‌ నీళ్లలో లీటర్‌ పాలు.. 81 మంది విద్యార్థులకు పంపిణీ

బకెట్‌ నీళ్లలో లీటర్‌ పాలు.. 81 మంది విద్యార్థులకు పంపిణీ

విద్యార్ధులకు పోషకాహారం అందించేందుకు మధ్యాహ్న భోజనంతో పాటు పాలు కూడా ఇవ్వాలని ఆయా ప్రభుత్వాలు నిర్ణయించాయి. అయితే విద్యార్థులకు ఇస్తున్న పాలల్లో నీళ్లే ఎక్కువ ఉంటున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లోని సోనభద్ర జిల్లాలో ఓ ప్రభుత్వ స్కూల్లో బకెట్ నీళ్లలో లీటరు పాలు కలిపి విద్యార్థులకు ఇస్తున్నారు. దాదాపు 81 మంది విద్యార్థులకు ఆ నీళ్ల పాలను గ్లాసుల్లో ఇచ్చారు. విద్యార్థులకు పాలు అందిస్తోన్న సమయంలో గ్రామ పంచాయతీ సభ్యుడు పాఠశాలకు వెళ్లగా.. విద్యార్థులకు నీళ్ల పాలు ఇస్తోన్న విషయాన్ని గుర్తించి, వీడియో తీశారు. ఈ ఘటనపై అధికారులను మీడియా ప్రశ్నించగా… పాల ప్యాకెట్లను సరఫరా చేయడంలో ఆలస్యమైందని, దీంతో తప్పు జరిగి ఉండొచ్చని చెప్పుకొస్తున్నారు.

తాము అదే రోజు మళ్లీ విద్యార్థులందరికీ సరిపడా పాలు పంపిణీ చేసినట్లు చెబుతున్నారు. తనకు ఒక ప్యాకెట్‌ పాలు మాత్రమే ఇచ్చారని, 81 విద్యార్థులకు వాటిని ఇవ్వాల్సి ఉంటుందని అందుకే తాను నీళ్లు కలుపాల్సి వచ్చిందని వంట మనిషి తెలిపింది. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం ఖర్చు చేస్తోన్న కోట్లాది రూపాయలు దారి మల్లుతున్నాయని ఆరోపిస్తున్నారు స్థానికులు.