- ఎకరం విస్తీర్ణంలో టీఆర్ఎస్ఆఫీసు నిర్మాణం
- మున్సిపల్ అనుమతి లేకుండానే కట్టడం
- చట్టాన్ని ఉల్లంఘించిన టీఆర్ఎస్ పార్టీ
- చర్యలు తీసుకోవాలంటున్న ప్రతిపక్ష లీడర్లు
మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు రాష్ర్ట ప్రభుత్వం టీఎస్ బీపాస్ను అమల్లోకి తెచ్చింది. కానీ.. అధికారంలో ఉన్న ఆ పార్టీయే తమ ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని బేఖాతర్ చేసింది. మున్సిపల్ పర్మిషన్ లేకుండానే ఏకంగా ఎకరం విస్తీర్ణంలో పార్టీ ఆఫీసును నిర్మించింది. మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్ కమిటీ రూలింగ్పార్టీకి జడిసి చేష్టలుడిగి చూస్తోంది.
మంచిర్యాల,వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 42/6 సర్వేనంబర్లో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు నిర్మాణం కోసం ఎకరం భూమిని ప్రభుత్వం కేటాయించింది. 168 జీవో ప్రకారం 4800 గజాల స్థలాన్ని గజం రూ.100 చొప్పున గులాబీ పార్టీకి కట్టబెట్టింది. కోట్ల విలువైన భూమిని రూ.4.80 లక్షలకు కొల్లగొట్టడమే కాకుండా మున్సిపల్ పర్మిషన్ లేకుండానే టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును నిర్మించారు. దానికి తెలంగాణ భవన్ అని పేరు పెట్టారు. 2019లో నిర్మాణం ప్రారంభమయ్యే నాటికి టీఎస్ బీపాస్ అమల్లోకి రానప్పటికీ.. నిర్మాణాలకు మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలనే నిబంధనలు ఉన్నాయి. కానీ అధికార పార్టీ లీడర్లు అవేమీ పట్టించుకోలేదు. సర్కారే మనదాయే.. ఇంకా అడ్డెవరు, అడిగేదెవరు అనుకున్నారో, లేక పర్మిషన్కు పైసలు దండగని భావించారో తెలియదు. జిల్లాలోని మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి అట్టహాసంగా భూమిపూజ చేసి చకచకా పనులు కొనసాగించారు. ఏడాదిలోపే అన్ని హంగులతో నిర్మాణం పూర్తి చేశారు. మళ్లీ సీఎం కేసీఆర్ జిల్లా పర్యటన సందర్భంగా తెలంగాణ భవన్ ప్రారంభోత్సవం చేయనున్నారు.
ప్రజలకు ఒక రూల్... టీఆర్ఎస్ పార్టీకి మరో రూల్...
మున్సిపాలిటీల్లో సామాన్య ప్రజలు చిన్న ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ ఇచ్చేందుకు మున్సిపల్ అధికారులు ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడం తెలిసిందే. పర్మిషన్ లేకుండా పేదలు చిన్న షెడ్డు వేసుకున్నా వెంటనే అధికారులు జేసీబీలతో ప్రత్యక్షమై బిల్డింగ్ చట్టాన్ని ఎంత స్ర్టిక్ట్గా అమలు చేస్తారో కూడా చూస్తున్నాం. కానీ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసు విషయంలో ఈ రూల్స్ ఏవీ అడ్డురాకపోవడం గమనార్హం. అధికార పార్టీయే అన్ని చట్టాలను తుంగలో తొక్కి స్వయంగా చట్టాలను రూపొందించే స్థానంలో ఉన్న రూలింగ్ పార్టీ లీడర్లకు అయినా మున్సిపల్ పర్మిషన్ తీసుకోవాలనే సోయి లేదా అని విపక్ష పార్టీల లీడర్లు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ భవన్కు మున్సిపల్ పర్మిషన్ లేకపోవడంతో దానికి హౌస్ నంబర్ ఇవ్వలేదు. దీంతో ఆస్తి పన్ను చెల్లించాలనే బాధ కూడా తప్పినట్టయిందని ప్రతిపక్ష లీడర్లు విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ అక్రమ నిర్మాణంపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
చట్టాలను అపహాస్యం చేశారు
టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వంద రూపాయలకే గజం చొప్పున స్థలం కేటాయించుకున్నరు. మున్సిపల్ పర్మిషన్, హౌస్ నంబర్ లేకుండా ఎకరం విస్తీర్ణంలో ఆఫీసు కట్టుకున్నరు. అధికారంలో ఉన్న పార్టీ చట్టాలను పాటించకపోవడమంటే చట్టాలను అపహాస్యం చేయడమే. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి.
- అగల్డ్యూటీ రాజు, బీజేపీ నస్పూర్ టౌన్ ప్రెసిడెంట్
పార్టీ ఆఫీసు పక్కనే కబ్జాలు...
మున్సిపల్ పర్మిషన్ లేకుండానే నిర్మాణాలు చేపట్టడం టీఆర్ఎస్ దర్పానికి నిదర్శనం. గులాబీ పార్టీ అక్రమ నిర్మాణాలపై అధికారులు స్పందించాలి. అంతేగాకుండా నస్పూర్లోని విలువైన ప్రభుత్వ భూములను రూలింగ్ పార్టీ లీడర్లు కబ్జాలు పెడుతున్నరు. పార్టీ జిల్లా ఆఫీసు పక్కనే షెడ్లు వేసి స్థలాలు ఆక్రమించుకున్నరు. వీటిపైనా యాక్షన్ తీసుకోవాలె.
- సురిమిళ్ల వేణు, కాంగ్రెస్ పార్టీ నస్పూర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్
పర్మిషన్ లేదు...
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన తెలంగాణ భవన్కు ఎలాంటి పర్మిషన్ లేదు. పర్మిషన్ కోసం మున్సిపాలిటీకి ఎవరూ దరఖాస్తు చేయలేదు.
- టి.రమేశ్, నస్పూర్ మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్