రెస్టారెంట్లల్లో ఏమైనా తినాలంటే ఇప్పుడు జనాలు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కడ ఏం తింటే అందులో ఏం వస్తు్ందో అన్న భయమే ఎక్కువైపోయింది. ఇప్పటికే మనం బిర్యానీలో బొద్దింకలు, ఈగలు, దొమలు రావడం చూసాం.. ఇప్పుడు ఓ రెస్టారెంట్ లో ఆర్డర్ చేసిన చికెన్ కర్రీలో ఏకంగా రూపాయి బిల్లలు వచ్చాయి. వినడానికి కాస్త విచిత్రంగా ఉంది కానీ... ఈ ఘటన రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి పిస్తా హౌస్ హోటల్ లో చోటుచేసుకుంది.
ఫిబ్రవరి 24 వ తేదీ శనివారం మధ్యాహ్నం సమయంలో ముగ్గురు యువకులు భోజనం చేసేందుకు ఈ హోటల్ కు వచ్చారు. అక్కడ రోటీతో పాటు చికెన్ కర్రీ ఆర్డర్ చేశారు. తింటున్న కాసేపటికి వారికి చికెన్ కర్రీలో రూపాయి బిల్లలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా షాకయ్యారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు రూపాయి బిల్లలు రావటం చూసి అవాక్కవటం యువకుల వంతైంది. దీంతో వెంటనే హోటల్ యాజమాన్యానికి కంప్లైంట్ చేశారు.
కర్రీలో రూపాయి బిల్లలు రావటమేంటని ప్రశ్ని్ంచారు. అంతేకాకుండా ఈ తంతగాన్నంతా యువకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో.. ఈ వీడియోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై యువకులు ఫుడ్ సెప్టీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.