ఆన్​లైన్​ బెట్టింగ్, ట్రేడింగ్‌కు కుటుంబం బలి

ఆన్​లైన్​ బెట్టింగ్, ట్రేడింగ్‌కు కుటుంబం బలి
  • భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. సాఫ్ట్​వేర్ ఇంజినీర్ ఆత్మహత్య 
  • రూ.20 లక్షలకు పైగా నష్టం రావడంతో సతమతం
  • ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సెల్ఫీ వీడియో
  • హైదరాబాద్​లో ఘటన.. మృతులది మంచిర్యాల 

జీడిమెట్ల, వెలుగు: ఆన్​లైన్​బెట్టింగ్, ట్రేడింగ్, ఓ కుటుంబాన్ని బలిగొన్నాయి. బెట్టింగ్, ట్రేడింగ్​లో రూ.20 లక్షలకు పైగా నష్టపోయి, చేసిన అప్పులు తీర్చలేక ఓ సాఫ్ట్​వేర్ ఇంజినీర్ తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం హైదరాబాద్ లోని గాజులరామారంలో జరిగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొండాపూర్​గ్రామానికి చెందిన ఇప్ప కొమురయ్య సింగరేణిలో పనిచేసి రిటైర్​అయ్యారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రెడ్డి కాలనీలో ఇల్లు కట్టుకొని సెటిల్​అయ్యారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. 

చిన్న కొడుకు వెంకటేశ్​(40)కు జిల్లా కేంద్రంలోని సూర్యనగర్​కు చెందిన వర్షిణి(33)తో వివాహమైంది. వారికి రిషికాంత్​(11), విహాంత్(3) అనే కొడుకులు ఉన్నారు. వెంకటేశ్​ సాఫ్ట్​వేర్ ​ఇంజినీర్​గా పనిచేస్తూ గాజులరామారంలోని బాలాజీ లేఅవుట్​సహస్ర అపార్ట్​మెంట్​లో మూడేండ్లుగా నివాసం ఉంటున్నాడు. కొంతకాలంగా ఆన్​లైన్​ బెట్టింగ్, ట్రేడింగ్​చేస్తూ రూ.20 లక్షలకు పైగా నష్టపోయాడు. దీంతో లోన్ యాప్​ల ద్వారా ఇన్​స్టంట్​లోన్లు తీసుకున్నాడు. 

తండ్రికి వాచ్ మెన్ నంబర్ పంపి.. 

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవాలని వెంకటేశ్ నిర్ణయించుకున్నాడు. తాను చనిపోతే భార్యాపిల్లలు అనాథలు అవుతారనే ఉద్దేశంతో.. శనివారం రాత్రి ఆ ముగ్గురికీ ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. తర్వాత భార్య చీరతో ఫ్యాన్​కు ఉరేసుకున్నాడు. అంతకుముందు ఆర్థిక సమస్యలతోనే తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని సెల్ఫీ వీడియో రికార్డింగ్​చేశాడు. 

స్వగ్రామంలోని తన తండ్రికి అపార్ట్​మెంట్ వాచ్​మెన్ నంబర్ మెసేజ్ పెట్టాడు. దీంతో ఆదివారం వాచ్​మెన్​కు ఫోన్​చేసిన ఆయన.. తన కొడుకును లేపాలని కోరాడు. అయితే ఆ సమయంలో ఎవరూ లేవరని తర్వాత లేపుతానని వాచ్ మెన్ చెప్పాడు. తిరిగి 5:30 గంటలకు మళ్లీ ఫోన్​ చేయడంతో వాచ్​మెన్ వెళ్లి చూడగా.. ఇంట్లో అందరూ విగతజీవులుగా పడి ఉన్నారు.