మూడో తరగతి నుంచే ఆన్ లైన్ క్లాసెస్: ఫస్ట్, సెకండ్ క్లాస్ పిల్లల చదువులెట్ల?

మూడో తరగతి నుంచే ఆన్ లైన్ క్లాసెస్: ఫస్ట్, సెకండ్ క్లాస్ పిల్లల చదువులెట్ల?

రాష్ట్ర సర్కార్ డెసిషన్..ఆందోళనలో పేరెంట్స్
కార్పొరేట్, ప్రైవేట్ లో అందరికీ ఆన్లైన్ పాఠాలు
హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూళ్ల‌లో ఆన్ లైన్ క్లాసుల నిర్వహణపై ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ తో కొందరు పేరెంట్స్ లో ఆందోళన మొదలైంది. ఈ నెల 20 నుంచి హైస్కూల్ స్టూడెంట్లకు, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి 3–5 తరగతుల పిల్లలకు ఆన్లైన్ పాఠాలు చెప్పాలని సర్కార్ నిర్ణ‌యం తీసుకుంది. కానీ ఫస్ట్, సెకండ్ క్లాస్ స్టూడెంట్ల గురించి ఏమీ చెప్పలేదు. ‘‘మరి..మా పిల్లల చదువులెట్ల?” అని ఫస్ట్, సెకండ్ క్లాస్ స్టూడెంట్ల పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ర్టంలో 18 వేల ప్రైమరీ, 3వేల అప్పర్ ప్రైమరీ సర్కార్ స్కూళ్లు ఉన్నాయి. కరోనా కారణంగా ఇవన్నీ మూతబడ్డాయి. రాష్ట్రంలో వైరస్ తీవ్రత తగ్గకపోవడంతో బడుల ప్రారంభంపై ప్రభుత్వం ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల‌లో ఆన్ లైన్ క్లాసులు చెబుతుండడం, పేరెంట్స్ ఒత్తిడి చేయడంతో సర్కార్ బడుల్లోనూ ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. అయితే కేవలం మూడు నుంచి పదో తరగతి స్టూడెంట్లకే ఆన్ లైన్ లో పాఠాలు చెప్పాలని నిర్ణ‌యించింది. మరి ఫస్ట్, సెకండ్ క్లాసుల స్టూడెంట్ల పరిస్థితి ఏంటని పేరెంట్స్ ప్రశ్నిస్తున్నారు.

4.5 లక్షలమంది పిల్లలు..

సర్కార్ స్కూళ్ల‌లో ఫస్ట్, సెకండ్ క్లాసుల పిల్లలు 4.5 లక్షల మందికి పైగా ఉంటారు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు సెకండ్ క్లాస్ కు వెళ్తారు. అంగన్ వాడీలు సహా కొన్ని సర్కార్ స్కూళ్ల‌లోని ఎల్ కేజీ, యూకేజీ పిల్లలు ఫస్ట్ క్లాస్ లోకి రానున్నారు. వారందరూ 4 నెలలుగా చదువుకు దూరంగా ఉన్నారు. మరోవైపు కార్పొరేట్, ప్రైవేటు స్కూళ్ల‌లో ఎల్ కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ పిల్లలకూ ఆన్ లైన్ పాఠాలంటూ మేనేజ్మెంట్లు హంగామా చేస్తున్నాయి. దీంతో తమ పిల్లలు చదువులో వెనుకబడిపోతారని సర్కారు స్కూళ్ల‌లో చదివే పిల్లల పేరెంట్స్ లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే కొందరు పేరెంట్స్ త‌మ పిల్లలకు టీవీల ద్వారా పాఠాలు చెప్పాలని టీచర్ల‌కు ఫోన్లు చేస్తున్నారు. సర్కారు నిర్ణ‌యం తీసుకోలేదని వారు చెబుతుండడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం