- రూ.530 కోట్లతో పరిపాలన అనుమతులు
- అంజయ్య నగర్ మీదుగా నిర్మాణం
- 1.8 కి.మీ పొడవు, 24 మీటర్ల వెడల్పు
- 6 లేన్లతో కట్టనున్న సర్కారు
- కూకట్పల్లి, జేఎన్టీయూ, నిజాంపేట్లో ట్రాఫిక్ తిప్పలకు చెక్
హైదరాబాద్ సిటీ, వెలుగు: సీఎంసీలోని ఆల్విన్ కాలనీ నుంచి మియాపూర్ వరకు ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. రోజూ వాహనాల రద్దీతో కిక్కిరిసిపోయే ఈ రూట్లో కొత్త ఫ్లైఓవర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం రూ.530 కోట్లను కేటాయిస్తూ ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులను (అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్) జారీ చేసింది.
అంజయ్య నగర్ మీదుగా 1.8 కిలోమీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పుతో ఆరు లేన్లతో ఈ ఫ్లైఓవర్ నిర్మాణం జరగనుంది. రూ.530 కోట్లలో నిర్మాణానికి సంబంధించి రూ.330 కోట్లు, నిర్మాణానికి అవసరమైన భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) కోసం మరో రూ.200 కోట్లు కేటాయించింది. పరిపాలన అనుమతులు మంజూరు కావడంతో అధికారులు త్వరలోనే భూసేకరణ ప్రక్రియను ప్రారంభించనున్నారు.
వీరికి ఇక ట్రాఫిక్ కష్టాలుండవ్
ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే గాజులరామారం, షాపూర్ నగర్, జీడిమెట్ల, చింతల్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగుతాయి. ఈ ప్రాంతాల నుంచి వచ్చేవారు బాలానగర్, వై జంక్షన్, కూకట్పల్లి, జేఎన్ టీయూ, నిజాంపేట్, హైదర్ నగర్ మీదుగా ట్రాఫిక్లో చిక్కుకుంటూ మియాపూర్, లింగంపల్లి, పటాన్చెరు వైపు వెళ్లాల్సి వస్తోంది.
ఫ్లైఓవర్ పూర్తయితే ఎలాంటి సిగ్నల్స్, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా జగద్గిరిగుట్ట మీదుగా ఆల్విన్ కాలనీ చేరుకొని అక్కడి నుంచి నేరుగా గమ్యస్థానాలకు సాఫీగా చేరుకోవచ్చు. దీనివల్ల బాలానగర్, కూకట్పల్లి, జేఎన్టీయూ, నిజాంపేట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ తగ్గే అవకాశముంది.
