బిజినెస్ డెస్క్, వెలుగు: కరోనా సంక్షోభం టైమ్లో ఒక రేంజ్లో విస్తరించిన ఆన్లైన్ కంపెనీలు ప్రస్తుతం ఫిజికల్ స్టోర్ల బాట పట్టాయి. దేశంలో ఇంకా ఆఫ్లైన్లోనే 90 % బిజినెస్ జరుగుతుండడంతో పాటు, తమ బ్రాండ్ను పాపులర్ చేసుకోవడానికి ఫిజికల్ స్టోర్లు సాయపడతాయని స్టార్టప్ కంపెనీలు భావిస్తున్నాయి. కరోనా టైమ్లో కేవలం ఆన్లైన్లోనే బిజినెస్ చేసే స్టార్టప్లు ఇప్పుడు హైబ్రిడ్ విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎడ్టెక్ కంపెనీలు బైజూస్, అన్అకాడమీ, వేదాంతు, ఆన్లైన్లో ఫర్నిచర్ను అమ్మే పెప్పర్ఫ్రై, వేక్ఫిట్ వంటి స్టార్టప్లు ఫిజికల్ స్టోర్లను ఏర్పాటు చేస్తున్నాయి. కొన్ని స్టార్టప్లు సొంతంగా స్టోర్లను ఓపెన్ చేస్తుండగా, మరికొన్ని స్టార్టప్లు ఫ్రాంచైజీ విధానంలో స్టోర్లను పెడుతున్నాయి.
కేవలం ఆన్లైన్ సరిపోదు..
ఆన్లైన్లో ట్యూషన్ సర్వీస్లను అందిస్తున్న బైజూస్, ఫిజికల్గా కూడా ట్యూషన్ సెంటర్లను ఓపెన్ చేస్తోంది. ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ను కొన్న బైజూస్, ఈ కంపెనీ ట్యూషన్ సెంటర్లను బైజూస్ సెంటర్లగా మారుస్తోంది. వేదాంతు కూడా లెర్నింగ్ సెంటర్లను ఓపెన్ చేస్తోంది. ఈ నెల చివరి నాటికి దేశంలోని 9 సిటీలలో 15 ఆఫ్లైన్ సెంటర్లను ఓపెన్ చేస్తామని అన్అకాడమీ ప్రకటించింది. ఐపీఓకి రావాలని చూస్తున్న పెప్పర్ఫ్రై, ఇప్పటికే ఒడిస్సా, బెంగళూరులలో స్టూడియోలను ఓపెన్ చేసింది. ఈ ఏడాది 10 రిటైల్ స్టోర్లను ఓపెన్ చేస్తామని వేక్ఫిట్ ప్రకటించింది. ఫస్ట్క్రై, బ్లూస్టోన్, క్యారెట్లేన్ వంటి కంపెనీలు ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్పై కూడా ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. జొమాటో, డంజో, బిగ్ బాస్కెట్ వంటి స్టార్టప్లు కూడా తమ డార్క్ స్టోర్లు (వేర్హౌస్) లను విస్తరిస్తున్నాయి. బ్లింకిట్ను కొనుగోలు చేసిన జొమాటో, ఈ కంపెనీకి ఉన్న 400 స్టోర్లను డార్క్ స్టోర్లుగా వాడుతోంది. టాటా కంపెనీ బిగ్బాస్కెట్ కూడా తమ డార్క్ స్టోర్లను 300 కు పెంచుకోవాలని ప్లాన్స్ వేస్తోంది.