ఈ పండగల సీజన్​లో ఆన్​లైన్​ సేల్స్​ పెరుగుతాయ్

ఈ పండగల సీజన్​లో ఆన్​లైన్​ సేల్స్​ పెరుగుతాయ్

రెడ్​సీర్​ రిపోర్టు
న్యూఢిల్లీ: ఈ పండగ సీజన్​లో ఆన్​లైన్​ అమ్మకాలు మన దేశంలో 23 శాతం పెరుగుతాయని కన్సల్టింగ్​ కంపెనీ రెడ్​సీర్​ వెల్లడించింది. ఆన్​లైన్​ బిజినెస్​ కంపెనీల గ్రాస్​ మర్చండైజ్​ వాల్యూ (జీఎంవీ) ఈసారి 900 కోట్ల​ డాలర్లు దాటుతుందని రెడ్​సీర్​ అంచనా వేస్తోంది. అంతకు ముందు ఏడాదిలో జీఎంవీ 74 0 కోట్ల డాలర్లు. ఇక ఏడాది మొత్తానికి చూస్తే ఆన్​లైన్​ బిజినెస్​ల అమ్మకాలు 5200 కోట్ల డాలర్ల దాకా అంటే కిందటేడాదితో పోలిస్తే 37 శాతం ఎక్కువగా ఉండొచ్చని రెడ్​సీర్​ తన రిపోర్టులో వెల్లడించింది. ఆన్​లైన్​ బిజినెస్​లకు కన్జూమర్లు ఎక్కువయ్యారని, కొవిడ్‌‌​ తర్వాత అన్ని వస్తువులు కొనడానికీ ఆన్​లైన్​నే ఇష్టపడుతున్నారని చెబుతూ, ఈ కారణాల వల్లే ఆన్​లైన్​ కంపెనీల సేల్స్​ బాగా పెరుగుతున్నాయని పేర్కొంది. పండగ సీజన్​ మొదటి వారంలో జీఎంవీ 30 శాతం పెరిగి 480 కోట్ల డాలర్లను చేరుకుంటుందని ఈ రిపోర్టు వెల్లడిస్తోంది. ఏదైనా ఆన్​లైన్​ ప్లాట్​ఫామ్​పై జరిగే మొత్తం అమ్మకాలనే గ్రాస్​ మర్చండైజ్​ వాల్యూగా చెబుతారు. ఇందులోంచి కాన్సిలేషన్స్​, రిటర్న్​ చేసిన వాటిని మినహాయిస్తారు. 
కొవిడ్‌‌​తో అందరూ ఆన్​లైన్​ బాటలోనే..
కొవిడ్‌‌ ​రాకతో ప్రజలు ఎక్కువగా ఆన్​లైన్​ కొనుగోళ్ల వైపు మళ్లారని, ఇందువల్లే అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయని రెడ్​సీర్​ రిపోర్టు వివరించింది. మరోవైపు టైర్​ 2 సిటీల నుంచి గ్రోత్​ బాగా ఎక్కువైందని, షాపింగ్​ చేసే మొత్తం వ్యక్తులలో 55 నుంచి 60 శాతం మంది ఈ టైర్​ సిటీల నుంచే ఉంటారని రెడ్​సీర్​ అసోసియేట్​ పార్ట్​నర్​ మ్రిగాంక్​ గుత్​గుతియా చెప్పారు. ఇంకోవైపు ఆఫ్​లైన్​ రిటెయిల్ ​కొవిడ్‌‌​ ముందు స్థాయికి చేరుకుంటోంది. దీంతో కొంత మంది రిటెయిల్​ షాపులకు వెళ్లి కొనుగోలు చేసే అవకాశాలూ ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ సారి కూడా పండగ సీజన్లో మొబైల్​ ఫోన్ల అమ్మకాలే లీడ్​లో ఉంటాయని, మొత్తం జీఎంవీలో వీటికి 11 శాతం వాటా (480 కోట్ల డాలర్లు)  ఉందని చెప్పారు. పండగ సీజన్​ కోసం చాలా మొబైల్​ కంపెనీలు కొత్త ఫోన్లను తెస్తున్నాయని పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్స్​ అండ్​ అప్లయెన్సెస్​ కేటగిరీ సేల్స్​ కూడా కిందటేడాదిలోని 14 శాతం నుంచి ఈ ఏడాది 16 శాతానికి పెరుగుతాయని రెడ్​సీర్​ రిపోర్టు పేర్కొంది. పండగ సీజన్​లోనే కొనాలనే ఉద్దేశంతో ఇప్పటిదాకా చాలా మంది కన్జూమర్లు తమ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారని వివరించింది. పండగల సీజన్​లో కొత్త లాంఛ్​లతోపాటు, ఆఫర్లూ  ఉంటాయనే ఆలోచనతోనే వారు వాయిదా వేసుకున్నట్లు తెలిపింది. ఈ కేటగిరీలో ఈఎంఐ కొనుగోళ్లు, బై నౌ పే లేటర్​ ఈసారి మంచి గ్రోత్​ సాధిస్తాయని అంచనా వేస్తున్నారు. ఫ్యాషన్​ కేటగిరీ కూడా మెరుగైన సేల్స్​తో దూసుకెళ్ల నుందని రెడ్​సీర్​ పేర్కొంది.