కేసీఆర్ సర్కారుకు మిగిలింది 529 రోజులే

కేసీఆర్ సర్కారుకు మిగిలింది 529 రోజులే

బూటకపు హామీల కేసీఆర్ సర్కారుకు బైబై చెప్పే సమయం వచ్చేసిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ చుగ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరో 529 రోజులే మిగిలాయని గుర్తుచేశారు. ఈ 529 రోజుల్లో..  ప్రతిదినం బండి సంజయ్ నేతృత్వంలో తెలంగాణ బీజేపీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్తాయని ఆయన ప్రకటించారు. టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపుతూ, బూటకపు హామీలను ఎండగడుతూ, కుటుంబవాద పాలనను గుర్తుచేస్తూ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ కొనసాగుతుందని తేల్చిచెప్పారు. శనివారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనకు సంబంధించిన కౌంట్ డౌన్ ను లెక్కించే వెబ్ సైట్ ను తెలంగాణ బీజేపీ ప్రారంభిస్తోందన్నారు. ‘‘ఇకపై తెలంగాణ బీజేపీ చేపట్టబోయే అన్ని కార్యక్రమాల్లో కేసీఆర్ కౌంట్ డౌన్  బోర్డును వినియోగిస్తాం. ప్రతి బీజేపీ కార్యాలయం ముందు ఈ బోర్డును ఏర్పాటుచేస్తాం’’ అని తరుణ్ చుగ్ వెల్లడించారు. 

బంగారు కల్వకుంట్ల కుటుంబాన్ని సాకారం చేసుకున్నారు

కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బంగారు తెలంగాణ కలలను చూపించి.. బంగారు కల్వకుంట్ల కుటుంబాన్ని సాకారం చేసుకున్నారని తెలిపారు. కేటీఆర్, కవిత, హరీశ్ రావు, సంతోష్ రావు సహా ఎంతోమంది కేసీఆర్ కుటుంబీకుల చేతిలో తెలంగాణ బందీగా మారిందని తరుణ్ చుగ్  మండిపడ్డారు. తెలంగాణ కోసం తాము చేసిన త్యాగాలను వృథా చేసేలా కేసీఆర్ నిరంకుశంగా పాలిస్తున్నారనే ఆందోళన తెలంగాణ ఉద్యమకారుల్లో గూడుకట్టుకుందని చెప్పారు. 

2, 3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు 

జూలై 1న సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా అధ్యక్షతన హైదరాబాద్ లో పార్టీ జాతీయ కార్యదర్శుల భేటీ జరుగుతుందని తరుణ్ చుగ్ తెలిపారు. ఇందులో 138 మంది బీజేపీ ఆఫీస్ బేరర్లు, అన్ని రాష్ట్రాల అధ్యక్షులు కూడా పాల్గొంటారని పేర్కొన్నారు.  ఈసందర్భంగా జాతీయ కార్యవర్గ సమావేశాల అజెండాపై, చేయాల్సిన తీర్మానాల గురించి నిర్ణయాలు తీసుకుంటారని వివరించారు. ఇక జూలై 2న ఉదయం బీజేపీ జాతీయ పదాధికారుల సమావేశం జరుగుతుందని, అదే రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి 3వ తేదీన సాయంత్రం 5 గంటల దాకా జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతాయన్నారు. దీనికి మొత్తం 340 మంది ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. జూన్ 3న సాయంత్రం  సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో  ప్రధాని మోడీ బహిరంగ సభ జరుగుతుందని వెల్లడించారు. దీనికి 17 రాష్ట్రాల సీఎంలు హాజరవుతారని వివరించారు.