ఇయ్యాల పుత్తుపల్లిలో చాందీ అంత్యక్రియలు

ఇయ్యాల పుత్తుపల్లిలో చాందీ అంత్యక్రియలు

తిరువనంతపురం: కేరళ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ(79) పార్థివ దేహాన్ని అధికారులు తిరువ‌నంత‌పురం నుంచి  కొట్టాయంకు తీసుకెళ్లారు. ప్రత్యేకంగా తయారు చేసిన బస్సులో  పార్థివ దేహాన్ని ఉంచి, బస్సును పూలు, చాందీ ఫొటోలతో అలంకరించారు. బుధవారం ఉదయం 7.20 గంటలకు తిరువనంతపురం నుంచి బస్సు బయలుదేరగా.. పార్టీ నేతలు, కార్యకర్తలు నినాదాలు చేస్తూ బస్సు వెంట నడిచారు. పిల్లలు, వృద్ధులతో సహా వేలాది మంది ప్రజలు బస్సు వెళ్తున్న మార్గంలో రోడ్డు పక్కన నిలబడి, మాజీ సీఎం పార్థివ దేహంపై పూల వర్షం కురిపించారు.

 ప్రజల సందర్శనార్థం చాందీ భౌతికకాయాన్ని తిరునక్కర గ్రౌండ్‌లో ఉంచి.. గురువారం ఆయన సొంత నియోజకవర్గం పుత్తుపల్లిలోని చర్చిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రెండుసార్లు కేరళ సీఎంగా పనిచేసిన చాందీ బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం కన్నుమూశారు.