- మెడిసిటీ హాస్పిటల్లో ఘటన
- దవాఖాన ఎదుట పేషెంట్ కుటుంబం ఆందోళన
మేడ్చల్, వెలుగు: ఆపరేషన్ మధ్యలో సరైన పరికరాలు లేవంటూ డాక్టర్లు ఓ మహిళకు మధ్యలోనే ట్రీట్మెంట్ ఆపేశారు. దీంతో బాధితురాలి బంధువులు ఆందోళనకు దిగారు. అలియాబాద్ గ్రామానికి చెందిన పుష్పలత హెర్నియా సమస్యతో బాధపడుతోంది. పుష్పలత కుటుంబ సభ్యులు ఈ నెల 17న మెడిసిటీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు శస్త్ర చికిత్స చేస్తామని చెప్పారు.
గురువారం ఆపరేషన్ ప్రారంభించి సరైన పరికరాలు లేవని మధ్యలోనే ఆపేశారు. పేషెంట్ ను మరో దవాఖానకు వెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. దీంతో పేషెంట్ బంధువులు దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు. ఆపరేషన్ బాధ్యత మీరే తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మేడ్చల్ పోలీసులు జోక్యం చేసుకుని హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి పేషంట్ ను మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి పంపించడంతో సమస్య సర్దుమణిగింది.
