ఆపరేషన్ ఆక్టోపస్..104 మంది సైబర్ క్రిమినల్స్ పట్టివేత

ఆపరేషన్ ఆక్టోపస్..104 మంది సైబర్ క్రిమినల్స్ పట్టివేత

బషీర్​బాగ్, వెలుగు: సైబర్​నేరాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్​ సిటీ సైబర్​ క్రైం​పోలీసులు భారీ ఆపరేషన్​ నిర్వహించారు. ఆపరేషన్​ అక్టోపస్​ పేరిట నిర్వహించిన ఈ స్పెషల్​ ఆపరేషన్​లో భాగంగా దేశవ్యాప్తంగా16 రాష్ట్రాల్లో సైబర్​ క్రిమినల్స్​ స్థావరాలపై దాడులు చేశారు. రాష్ట్రంలో సైబర్​ నేరాలతో సంబంధం ఉన్న 104 మందిని రాష్ట్రానికి తీసుకువచ్చారు.

ఇందులో ఒక బ్యాంకు ఉద్యోగి కూడా ఉండడం గమనార్హం. సైబర్ క్రైమ్స్ డీసీపీ వి.అరవింద్ బాబు నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆపరేషన్​వివరాలను సీపీ సజ్జనార్​ వెల్లడించారు. ఇటీవల డిజిటల్ అరెస్ట్, ఇన్వెస్ట్​మెంట్  ఫ్రాడ్స్, ట్రేడింగ్ ఫ్రాడ్స్​ జరుగుతున్నాయి. ఇదంతా ఒక నెట్​వర్క్​లా చేస్తున్నారని గుర్తించిన హైదరాబాద్​ సైబర్​ క్రైం​పోలీసులు ఆపరేషన్  ఆక్టోపస్  మొదలుపెట్టారు.

తరుచుగా డబ్బులు బదిలీ అయ్యే 151 బ్యాంక్ అకౌంట్లను గుర్తించారు. ఈ నెట్​వర్క్​ను నిర్వీర్యం చేసేందుకు టెక్నికల్​గా అనుభవం ఉన్న 32 స్పెషల్​ టీమ్స్​ను ఏర్పాటు చేసి, ఒక్కో రాష్ట్రానికి రెండు టీమ్స్​చొప్పున  పంపించారు. వీరంతా పది రోజుల పాటు దాడులు చేసి 104 మందిని అరెస్ట్​ చేశారు. ఇందులో 86 మంది మ్యూల్  అకౌంట్  హోల్డర్స్  ఉన్నారు. వీరు బాధితుల నుంచి అకౌంట్లలో డబ్బులను బదిలీ చేయించుకొని , వేర్వేరు అకౌంట్లకు ఆ డబ్బులను బదిలీ చేస్తూ స్కామర్స్ కు సహకరిస్తున్నారు.

బంధన్  బ్యాంక్  మేనేజర్  కూడా..

బ్యాంకింగ్ కు సంబంధించిన ఇంటర్నల్​ సమాచారం అందజేస్తూ  ఫేక్  డాక్యుమెంట్స్ తో అకౌంట్స్ తెరుస్తూ , స్కామర్స్ కు సహకరిస్తున్న బంధన్  బ్యాంక్  రిలేషన్ షిప్  మేనేజర్  కూడా అరెస్టయ్యాడు. నిందితులపై దేశ వ్యాప్తంగా 1055 సైబర్  కేసులు నమోదు కాగా , రూ.127 కోట్లు కాజేశారు. అరెస్ట్  చేసిన వారి నుంచి రూ.36 లక్షలు సీజ్ చేశారు. 204 మొబైల్  ఫోన్స్, 141 సిమ్ కార్డ్స్, 152 బ్యాంక్  పాస్ బుక్స్, 234 డెబిట్/క్రెడిట్ కార్డులు, 26 ల్యాప్ టాప్ లు, 56 స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.