కోదాడ, వెలుగు : యాక్సిడెంట్లో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి ఆర్గాన్స్ డొనేట్ చేసి.. నలుగురి ప్రాణాలను కాపాడారు. అవయవదానానికి యువకుడి తల్లి అంగీకారించారు. కోదాడ మండలం చిమిర్యాలకు చెందిన గొర్రె రాజ్ కుమార్(19) తండ్రి ఇంతకు ముందే చనిపోయారు. దీంతో అతని ఫ్యామిలీ కోదాడలో ఉంటోంది. ఈనెల 3న రాజ్ కుమార్ బైక్మీద ఖమ్మం వెళ్ళివస్తుండగా కోదాడ సమీపంలోని తమ్మర గ్రామం దగ్గర యాక్సిడెంట్ జరిగింది.
తలకు గట్టి దెబ్బతగలడంతో ఖమ్మం దవాఖానాలో చేర్చారు. మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. తొమ్మిది రోజుల పాటు ట్రీట్మెంట్చేసిన డాక్టర్లు బ్రెయిన్ డెడ్గా డిక్లేర్చేసి.. అతని అవయవాలను దానం చేయాలని రాజ్కుమార్ తల్లి పద్మను కోరారు. తల్లి అంగీకారంలో కిడ్నీలు, లివర్, లంగ్స్, కళ్ళను డాక్టర్లు సేకరించారు. డెడ్బాడీని చిమిర్యాలకు తరలించి, అంత్యక్రియలు పూర్తిచేశారు. చేతికందిన కొడుకు చనిపోయిన విషాదంలోనూ నలుగురి ప్రాణాలు కాపాడేందుకు ముందుకు వచ్చిన యువకుడి తల్లిని స్థానికులు అభినందించారు. నిరుపేదలైన పద్మ ఫ్యామిలీని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.