
- సర్కారుకు ఉస్మానియా యూనివర్సిటీ ప్రతిపాదన
- ఏ ఫెలోషిప్ రానోళ్లకు నెలకు రూ.10 వేల స్టైపెండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఏ ఫెలోషిప్ రాని పీహెచ్డీ స్కాలర్లకు ‘కేసీఆర్ డాక్టోరల్ ఫెలోషిప్’ పేరిట స్టెపెండ్ ఇచ్చేందుకు ఉస్మానియా యూనివర్సిటీ కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగా ఒక్కో స్టూడెంట్కు నెలకు రూ.10 వేల స్టైపెండ్ ఇచ్చేలా సర్కారుకు ప్రతిపాదనలు పంపింది. దీనికి సర్కారు పెద్దలు కూడా సూచనాప్రాయ అంగీకారం తెలిపారని, బడ్జెట్లో పెట్టే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 10 వేల మంది పీహెచ్డీ స్కాలర్లున్నారు. పరిశోధనలకు నేషనల్ ఫెలోషిప్ పేరిట ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులకు స్టైపెండ్ ఇస్తున్నారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) కూడా ఇస్తున్నారు. గతంలో ఎక్కువమందికి ఫెలోషిప్ వస్తుండగా.. వివిధ కారణాలతో వారి సంఖ్య ఏటా తగ్గిపోతోంది. దీంతో కొన్ని సెంట్రల్ వర్సిటీలు సొంతంగా ఫెలోషిప్లు ఇస్తున్నాయి. అదే విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని ఇటీవల జరిగిన వీసీల మీటింగ్లో సర్కారుకు ఓయూ ప్రతిపాదించింది. మంత్రి సబితా రెడ్డి, సీఎస్ సోమేశ్కుమార్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రికి ఫెలోషిప్ గురించి వివరించింది. ఫెలోషిప్కు కేసీఆర్ పేరు పెడుతుండడంతో అందరూ అంగీకరించినట్టు తెలుస్తోంది. దీంతో ఏండ్ల నుంచి ప్రాజెక్టు రిపోర్టులను సబ్మిట్ చేయని వారందరి అడ్మిషన్లను క్యాన్సిల్ చేసి.. మార్చి 31లోగా పీహెచ్డీ స్కాలర్ల సంఖ్యను ఓయూ అధికారులు పైనల్ చేయనున్నారు. ఫెలోషిప్కు బడ్జెట్లో సర్కారు ఆమోదం తెలిపితే.. లెక్కతేలిన స్కాలర్లకు ఫెలోషిప్ను అందించనున్నారు. కాగా స్కాలర్షిప్లను, మెస్ చార్జీలను పెంచాలని ఓయూ అధికారులు కోరుతున్నారు.