హైదరాబాద్, వెలుగు: పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో తమ అభ్యంతరాలు, వినతులను పట్టించుకోవడం లేదని పేర్కొంటూ కేంద్ర జల సంఘానికి తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లెటర్ రాశారు. పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా రాష్ట్రంలోని 954 ఎకరాలు ముంపునకు గురవుతాయని తెలిపారు. తాము లేవనెత్తిన తొమ్మిది అంశాల్లో ఒక్కదానిపై కూడా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని ఆరోపించారు.
పీపీఏ నుంచి సమన్వయ లోపం ఉందని మురళీధర్ తన లేఖలో వెల్లడించారు.సుప్రీంకోర్టుకు కేంద్రం నివేదించినట్లు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని.. సీడబ్ల్యూసీ, పీపీఏ సమావేశాల్లో ఇచ్చిన హామీలు కంటి తుడుపుగానే మిగిలిపోయాయని వివరించారు. తక్షణమే తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర జలసంఘాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరింది.