హైదరాబాద్ లో కోటి దాటిన ఓటర్లు

హైదరాబాద్ లో కోటి దాటిన ఓటర్లు
  •     గ్రేటర్​ సిటీలో కొత్తగా 5.5 లక్షల మంది నమోదు
  •     ఫైనల్​ లిస్ట్​ వచ్చే నాటికి మరో 5 లక్షల మంది పెరిగే అవకాశం
  •     గతేడాది అక్టోబర్​4 నాటికి 95 లక్షల మంది ఓటర్లు
  •     తాజాగా 1,00,36,605కు చేరిన ఓటర్ల సంఖ్య

హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​హైదరాబాద్​లో నయా రికార్డు నమోదైంది. మొత్తం 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి ఓటర్ల సంఖ్య కోటి దాటింది. లోక్​సభ ఎన్నికలకు ముందు ఓటర్లు పెరగడం మంచి పరిణామం అని అధికారులు చెబుతున్నారు. 2024 ప్రత్యేక సవరణ ఓటరు జాబితా ప్రకారం గ్రేటర్ లో 1,00,36,605 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఐదున్నర లక్షల మంది కొత్త ఓటర్లు నమోదైనట్లు చెబుతున్నారు. లోక్​సభ ఎన్నికలకు ముందు వచ్చే ఫైనల్​లిస్ట్​లో మరో 5 లక్షల మంది ఓటర్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, గతేడాది అక్టోబర్ 4న ఎలక్షన్​కమిషన్​రిలీజ్​చేసిన లిస్ట్​ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 25 నియోజకవర్గాల్లో 95 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య కోటి దాటింది. ఇందులో 52,48,106 మంది పురుషులు,  47,87,171 మంది మహిళలు, 1,328 ఇతరులు ఉన్నారు.

జిల్లాల వారీగా ఓటర్లు..

ఎన్నికల సంఘం తాజా లెక్కల ప్రకారం హైదరాబాద్ జిల్లాలో 45,70,138 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 23,30,574 మంది, మహిళలు 22,39,240 మంది, ఇతరులు 324 మంది ఉన్నారు. గ్రేటర్ పరిధిలోకి వచ్చే మేడ్చల్– మల్కాజిగిరి జిల్లాలోని కూకట్ పల్లి, మల్కాజిగిరి, ఉప్పల్, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 22,17,717 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 11,46,854, మహిళలు 10,70,533, ఇతరులు 498 మంది ఉన్నారు. గ్రేటర్​పరిధిలోకి వచ్చే రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లో మొత్తం 28,41,331 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు14,73,621 మంది, 13,67,289 మహిళలు, ఇతరులు 421 మంది ఉన్నారు. అలాగే సంగారెడ్డి జిల్లాలోని పఠాన్ చెరు నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 4,07,419 మంది ఉండగా, ఇందులో పురుషులు 2,09,757మంది, మహిళలు 1,97,577, ఇతరులు 85 మంది ఉన్నారు.

ఈ నెల 14 వరకు అవకాశం

ఈ నెల 14(ఆదివారం) వరకు కొత్త ఓటరు నమోదుకు అవకాశం ఉంది. నామినేషన్ల సేకరణకు 10 రోజుల ముందు వరకు వచ్చిన ఫామ్​6 దరఖాస్తులను పరిశీలించి, అధికారులు ఓటు హక్కు కల్పించనున్నారు. ఫైనల్​లిస్ట్​వచ్చేనాటికి మరో 5 లక్షల మంది ఓటర్లు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మొత్తంగా గ్రేటర్​లోని ఓటర్ల సంఖ్య 1.05కోట్లకు చేరనుందని చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓటరు నమోదుపై జీహెచ్ఎంసీ విస్తృత ప్రచారం చేస్తోంది. ఇబ్బందులు ఉంటే వెంటనే స్పందించేలా చర్యలు తీసుకుంటోంది. దీంతోనే కొత్త ఓటర్ల ఓటర్ల సంఖ్య భారీగా పెరిగిందని అధికారులు చెబుతున్నారు.