తెలంగాణలో రైతు భరోసా కోసం కొత్తగా 5 లక్షలకుపైగా అప్లికేషన్లు!

తెలంగాణలో రైతు భరోసా కోసం కొత్తగా 5 లక్షలకుపైగా అప్లికేషన్లు!
  • దరఖాస్తు చేసుకునేందుకునేడు ఆఖరు తేదీ
  • ఏఈఓల వద్ద అప్లైచేసుకుంటున్న రైతులు
  • ప్రస్తుతం కోటి 49 లక్షల ఎకరాలకురైతు భరోసా
  • లబ్ధి పొందుతున్న70.11 లక్షల మంది రైతులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా పంట భూములు రిజిస్ట్రేషన్​ చేసుకున్న రైతులకు రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడంతో గత వారం రోజులుగా పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. జూన్‌‌‌‌ 5 లోపు రిజిస్ట్రేషన్‌‌‌‌  అయిన పంట భూములకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు అనుమతించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 70.11 లక్షల మంది రైతులకు చెందిన కోటి 49 లక్షల ఎకరాలకు  రైతుభరోసా అందిస్తున్నారు. అర్హత ఉండి దరఖాస్తు చేసుకోవాల్సిన వారికి ఈనెల 20 వరకు గడువు ఇవ్వగా శుక్రవారంతో ఈ గడువు ముగియనుంది. క్షేత్రస్థాయిలో అగ్రికల్చర్​ ఎక్స్​టెన్షన్​ ఆఫీసర్లు గ్రామాల్లోని రైతుల నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తున్నరు.  ఏఈఓలకు రైతుల పట్టాదార్​ పాస్​ పుస్తకాలు, ఆధార్​ కార్డులు, బ్యాంకు పాస్​ పుస్తకాలు వంటి ధ్రువపత్రాలు ఇస్తే, రైతు భరోసా పోర్టల్‌‌‌‌లో నమోదు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 5 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చినట్లు సమాచారం. 

తక్కువ సమయం గడువు ఇవ్వడంతో రైతుల నుంచి ఒత్తిడి పెరిగిందని అధికారులు అంటున్నరు. కొత్తగా భూమి యాజమాన్య హక్కులు పొందిన రైతులకు రైతు భరోసా పథకం వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించి, ఈనెల 5ను కటాఫ్‌‌‌‌ తేదీగా ప్రకటించింది. నిర్ణీత గడువులోగా పంట భూముల క్రయవిక్రయాలు, మ్యుటేషన్‌‌‌‌  జరిగి, యాజమాన్య హక్కులు పొందిన రైతులకు ఈ వానాకాలం సీజన్​కు సంబంధించి రైతు భరోసాను వర్తింపజేస్తున్నరు.  భూభారతిలో నమోదైన భూమి రిజిస్ట్రేషన్‌‌‌‌  ఎవరి పేరుమీద ఉంటే వారికి రైతు భరోసా అందిస్తున్నరు. అయితే 2023–25 వరకు రాష్ట్రంలో 12 వేలకు  భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. 

గత ఏడాది ఐదున్నర లక్షల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏఈఓలు రైతు భరోసా లబ్ధిదారుల నమోదు ప్రక్రియను చేపడుతున్నారు. సీసీఎల్‌‌‌‌ఏ నుంచి వచ్చిన డేటా ఆధారంగా రైతుల నుంచి వివరాలు సేకరించాలని అగ్రికల్చర్​ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాల నమోదుకు నేటితో గడువు ముగియనుంది. ఈలోగా రైతుల వివరాలు నమోదు చేస్తే వాళ్లు లబ్ధిదారుల జాబితాలోకి వస్తారు.