‘‘రూపాయి బలహీనపడటం లేదు.. కానీ డాలర్ విలువే బలపడుతోంది’’ అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల చేసిన కామెంట్స్ కు కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కౌంటర్ ఇచ్చారు. ‘‘రూపాయి బలహీనపడట్లేదు.. డాలరే బలపడుతోందని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇది అక్షరాలా నిజమే.. ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన అభ్యర్థి లేదా పార్టీ కూడా ఎప్పుడూ ఇలాగే ... మేం ఓడిపోలేదు. అవతలి పార్టీనే గెలిచింది అని చెబుతుంటారు’’ అని చిదంబరం ట్వీట్ చేశారు.
రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి పడిపోవడంపై సీతారామన్ శనివారం వాషింగ్టన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూపాయి బలహీనపడటం లేదని, డాలర్ విలువే బలపడుతోందని ఆమె అన్నారు. ఇతర దేశాల కరెన్సీలతో పోల్చుకుంటే రూపాయి విలువ ఆశాజనకంగానే ఉన్నట్లు చెప్పారు. ఆమె చేసిన కామెంట్స్ పై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.