పడిక్కల్ సెంచరీ.. రాహుల్ ఇంజ్యూరీ.. తొలి రోజు భారత్ స్కోర్ ఎంతంటే?

పడిక్కల్ సెంచరీ.. రాహుల్ ఇంజ్యూరీ.. తొలి రోజు భారత్ స్కోర్ ఎంతంటే?

IND vs SL: శ్రీలంకతో గాలే వేదికగా ఈరోజు (శనివారం, ఆగస్టు 15న) ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజే భారత ఇన్నింగ్స్‌లో ఎన్నో ఆసక్తికరమైన ఘట్టాలు చోటు చేసుకున్నాయి. మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుతమైన సెంచరీతో మెరవగా, మరోవైపు హాఫ్ సెంచరీ సాధించి మంచి ఫామ్‌లో ఉన్న వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తీవ్రమైన కండరాల నొప్పులతో (Cramps) మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అనంతరం వర్షం కారణంగా తొలి రోజు మ్యాచ్ నిలిచిపోయింది. 

పడిక్కల్ డ్రీమ్ కమ్‌బ్యాక్.. 
2024–25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తర్వాత మళ్లీ భారత్ తరఫున సుదీర్ఘ విరామం అనంతరం రీఎంట్రీ ఇచ్చిన దేవదత్ పడిక్కల్, తన 3వ టెస్టు మ్యాచ్‌లోనే తొలి సెంచరీ సాధించి మూడో నంబర్ స్థానాన్ని తన సొంతం చేసుకున్నాడు.  కాగా 21వ శతాబ్దంలో టీమిండియా తరఫున మూడో నంబర్‌లో టెస్టు సెంచరీ చేసిన రెండో ఎడమచేతి వాటం బ్యాటర్‌గా పడిక్కల్ నిలిచాడు. గతంలో 2002లో జింబాబ్వేపై సౌరవ్ గంగూలీ (136) ఈ ఘనత సాధించాడు. ఛటేశ్వర్ పుజారా వైదొలిగిన తర్వాత భారత్ ఆ స్థానంలో ఏకంగా 11 మంది బ్యాటర్లను పరీక్షించింది. సెప్టెంబర్ 2024లో శుభ్‌మన్ గిల్ సెంచరీ కొట్టిన తర్వాత, గత 19 టెస్టుల్లో 7 వేర్వేరు బ్యాటర్లు ఆడినా ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు. గిల్ కెప్టెన్‌గా మారి 4వ స్థానానికి వెళ్లడంతో ఖాళీ అయిన 3వ స్థానానికి పడిక్కల్ సెంచరీ కొట్టి తన స్థానం ఇదేనని సాంకేతాలు ఇచ్చాడు. 

77 పరుగుల వద్ద కేఎల్ రాహుల్‌ రిటైర్డ్ హర్ట్‌: 
భారత్ వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ మరోవైపు బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. యశస్వి జైస్వాల్ రనౌట్ అయినా, పడిక్కల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపిస్తూ 9 ఫోర్లు, 1 సిక్సర్‌తో 77 పరుగులు చేశాడు. అయితే రెండో సెషన్ నుంచి తీవ్రమైన కండరాల నొప్పులతో (Severe Cramps) బాధపడిన రాహుల్, కుడి చేతితో పాటు ఎడమ చేతి వేళ్లలో కూడా నొప్పితో ఇబ్బంది పడ్డాడు. మైదానంలో నడవడానికి కష్టపడుతూ తీవ్రమైన అసౌకర్యానికి గురవడంతో వేరే దారి లేక రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. రాహుల్ గాయం తీవ్రమైనది కాదని, తీవ్రమైన క్రాంప్స్ మాత్రమేనని భావిస్తుండటంతో కోలుకుంటే మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది. 

వర్షంతో నిలిచిన ఆట: 
కేఎల్ రాహుల్ మైదానాన్ని వీడటంతో సెంచరీ హీరో పడిక్కల్‌కు తోడుగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. కానీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. కేవలం 16 పరుగులు మాత్రమే చేసి డకౌట్ కి చేరిన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్ తో కలిసి పడిక్కల్ బ్యాటింగ్ కొనసాగిస్తున్న సమయంలో.. వర్షం కురవడంతో, మ్యాచ్‌ను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో భారత జట్టు తొలి 250+ పరుగులు చేసింది.