కాంగ్రెస్​, బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మొద్దు : పద్మా దేవేందర్ రెడ్డి

కాంగ్రెస్​, బీజేపీ కల్లబొల్లి మాటలు నమ్మొద్దు : పద్మా దేవేందర్ రెడ్డి

పాపన్నపేట, వెలుగు: ఎన్నికల సమయంలో ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మొద్దని బీఆర్ఎస్​మెదక్​అభ్యర్థి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆమె మండల పరిధిలోని యూసుఫ్​పేట, ఆరేపల్లి, కుర్తివాడ, దౌలాపూర్, మిన్పూర్, మల్లంపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు.

ఈ సారి అధికారంలోకి వస్తే రైతుబంధు సాయం ఎకరాకు రూ.16 వేలు ఇవ్వడంతోపాటు,  రేషన్​షాప్​ల ద్వారా సన్న బియ్యం, రూ.400 లకే  గ్యాస్ సిలిండర్, సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా డ్వాక్రా గ్రూప్​ మహిళలకు నెలకు రూ.3 వేల జీవన భృతి అందించనున్నట్టు తెలిపారు. ప్రశాంతమైన మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి వచ్చి గొడవలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, జిల్లా రైతు బంధు సమితి  అధ్యక్షుడు సోములు, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు జగన్, పార్టీ మండల అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఏడుపాయల చైర్మన్ బాలగౌడ్, ఎంపీటీసీల ఫోరం మడల అధ్యక్షుడు కుబేర్ పాల్గొన్నారు.