ఇస్లామాబాద్: భారత్పై మరోసారి పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చాటుకున్నది. సింధూ జలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీ) కింద తమకు దక్కాల్సిన నీటి వాటాను ఎవరైనా అడ్డుకోవాలని చూస్తే, ‘ఆ చేతులను నరికివేస్తాం’ అంటూ పాక్ వాతావరణ మార్పుల శాఖ మంత్రి ముసాదిక్ మాలిక్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. 2025లో జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానికుడు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ఈ హేయమైన చర్యకు నిరసనగా భారత్.. దశాబ్దాల నాటి సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టింది. ఈ నేపథ్యంలో పాక్ మంత్రి చేసిన ఈ అనాలోచిత వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచేలా ఉన్నాయి. మంగళవారం ఓ మీడియా సమావేశంలో మాలిక్ మాట్లాడుతూ.. పొరుగు దేశపు ప్రధాని(భారత్) చేతిలో ఒక పంపు ఉందని, పాకిస్తాన్లోకి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా చేస్తానని ఆయన అంటున్నారని తెలిపారు.
‘‘భారత్ మా నీటి వాటాను నియంత్రిస్తున్నది. పాకిస్తాన్ వాటాకు ఎవరైనా అడ్డుపడితే ఊరుకునేది లేదు” అని హెచ్చరించారు. పాకిస్తాన్లోని 40-–50 శాతం జనాభా జీవనోపాధి కోసం వ్యవసాయంపైనే ఆధారపడి ఉందని తెలిపారు. ‘‘దేశ ఆహార భద్రతను, 50% ఉపాధిని, 25% ఆర్థిక వ్యవస్థను నియంత్రించాలని చూస్తున్నారు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా నీటిని ఎలా ఆపుతారు..?
ప్రపంచంలో మరెక్కడైనా ఒప్పందం లేకపోయినా సరే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం నీటి ప్రవాహం కొనసాగుతుందని ముసాదిక్ మాలిక్ వ్యాఖ్యానించారు.‘‘ఎగువన ఉన్న దేశానికి దిగువన ఉన్న దేశానికి నీటిని ఆపే హక్కు ఉంటుందా..? సింధూ జలాల విషయంలో ఒప్పందం కూడా ఉంది. మరి ఇక్కడ నీటిని ఎలా ఆపుతారు..? ఇదే విషయాన్ని మేం రేపు అంతర్జాతీయ సమాజం ముందు ఉంచుతాం” అని అన్నారు.
