
భారత ఆర్మీ స్థావరాలే టార్గెట్ గా ఎఫ్ 16 విమానాలతో దాడికి యత్నించిన పాకిస్తాన్ కష్టాల్లో పడింది. పాక్ దుశ్చర్యను అమెరికా దృష్టికి తీసుకువెళ్లింది భారత్. ఎఫ్ 16 విమానాలను పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తుందని ఫిర్యాదు చేసింది.
2008లో అమెరికా నుంచి F-16 యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది పాకిస్తాన్. అయితే కొనుగోలు సమయంలో ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఉగ్రవాదులపై చర్యల కోసమే F-16 యుద్ధ విమానాలను ఉపయోగించాలని, ఇతర దేశాలపై దాడులు చేయవద్దనేది ఆ నిబంధన. పాకిస్తాన్ మాత్రం F-16 యుద్ధ విమానాలను భారత్ పై ప్రయోగించాలని చూసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాటిని ధీటుగా ఎదుర్కొంది. వింగ్ కమాండర్ అభినందన్ వదిలిన మిస్సైల్ తగిలి ఒక ఎఫ్-16 విమానం కూలిపోయింది. దానికి సంబంధించిన కొన్ని శకలాలను సేకరించిన IAF రెండు రోజుల క్రితం మీడియా ముందు ప్రదర్శించింది. అవే ఆధారాలతో అమెరికాకు పాకిస్తాన్ పై ఫిర్యాదు చేసింది భారత్.
F-16 యుద్ధ విమానాన్ని కూల్చేశామని భారత్ ప్రకటించినపుడు పాకిస్తాన్ బుకాయించింది. తాము F-16 యుద్ధ విమానాలను ఉపయోగించలేదని ప్రకటించింది. అమెరికాతో ఒప్పందానికి విరుద్ధం కాబట్టే పాకిస్తాన్ అలా చెప్పిందని తెలుస్తోంది. భారత అధికారులు అన్ని ఆధారాలు బయటపెట్టడంతో ఇప్పుడు అడ్డంగా బుక్కైంది పాకిస్తాన్. భారత్ ఫిర్యాదుపై అగ్రరాజ్యం ఎలా స్పందిస్తున్నదని ఆసక్తి గా మారింది.