
- కోలుకోవడానికి నాలుగైదేండ్లు పడ్తదని వెల్లడి
- పూంఛ్లో బాధితులకు పరామర్శ
పూంఛ్: పాకిస్తాన్ సర్వైలెన్స్ సిస్టమ్ను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) పూర్తిగా నాశనం చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఇది ఆ దేశానికి పెద్ద దెబ్బ అన్నారు. పాక్ తన నిఘా వ్యవస్థను తిరిగి ఏర్పాటు చేసుకోవడానికి కొన్నేండ్లు పడుతుందని పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ టూర్లో భాగంగా శుక్రవారం పూంఛ్ జిల్లాలో అమిత్ షా పర్యటించారు.
పాకిస్తాన్ కాల్పుల్లో చనిపోయినోళ్ల కుటుంబాలను పరామర్శించారు. పాక్ షెల్లింగ్లో దెబ్బతిన్న ఇండ్లను, ప్రార్థనా స్థలాలను పరిశీలించారు. అనంతరం బీఎస్ఎఫ్ జవాన్లను కలిశారు. ఈ సందర్భంగా షా మాట్లాడుతూ..‘‘ మనం ఆపరేషన్ సిందూర్లో భాగంగా ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తే, బార్డర్లో
జనావాసాలే లక్ష్యంగా పాక్ కాల్పులకు తెగబడింది. అయితే ఆ దేశానికి బీఎస్ఎఫ్ తగిన బుద్ధి చెప్పింది. 118 పాకిస్తానీ ఫార్వర్డ్ పోస్టులను నాశనం చేసింది. ఆ దేశ సర్వైలెన్స్ సిస్టమ్ను తుక్కుతుక్కు చేసింది. దాన్ని తిరిగి నిర్మించుకోవడానికి పాక్కు నాలుగైదేండ్ల టైమ్ పడ్తుంది” అని తెలిపారు. ‘‘పాకిస్తాన్ కమ్యూనికేషన్ సిస్టమ్, సర్వైలెన్స్ ఎక్విప్మెంట్ మొత్తం ధ్వంసమైందని బీఎస్ఎఫ్ డీజీ చెప్పారు. ఇక అవి లేకుండా పాక్ ఎలాంటి యుద్ధం చేయలేదు. ఇది ఆ దేశానికి పెద్ద దెబ్బ” అని పేర్కొన్నారు.
మన బీఎస్ఎఫ్ జవాన్లు కేవలం మూడ్రోజుల్లో పాక్కు పెద్ద ఎత్తున నష్టం చేకూర్చారని ప్రశంసించారు. ‘‘మీరు శాంతి సమయంలోనూ శత్రు స్థావరాలపై కన్నేసి ఉంచారు. అవకాశం రాగానే అత్యంత కచ్చితత్వంతో టార్గెట్లను నాశనం చేశారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ డ్యామేజీ చేశారు” అని జవాన్లను మెచ్చుకున్నారు. దేశంపై జరిగే ప్రతి దాడిని మొదట ఎదుర్కొనేది బీఎస్ఎఫ్ జవాన్లే అని, అందుకే వాళ్లంతా డిఫెన్స్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ అని కొనియాడారు.
బాధితులను ఆదుకుంటం..
పాకిస్తాన్ కాల్పుల్లో చనిపోయినోళ్ల ఫ్యామిలీ లను, ఇండ్లు, షాపులు దెబ్బతిన్న కుటుంబా లను ఆదుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. బాధితులకు త్వరలోనే పరిహారం ప్రకటిస్తామని వెల్లడించారు. అమాయక ప్రజలు లక్ష్యంగా పాక్ కాల్పులకు తెగబడిందని మండిపడ్డారు.