కర్తార్ పూర్ కారిడార్ ను శనివారం ఇరు దేశాల ప్రధానమంత్రులు ప్రారంభించనున్నారు. అయితే.. యాత్రికులకు పాస్ పోర్టు ఉండాల్సిందే అన్న పాక్ అధికారుల మాటలపై.. భారత విదేశాంగశాఖ అధికారులు సీరియస్ అయ్యారు. రూల్ ప్రకారం నడుచుకోవాలని సూచించారు. కర్తార్ పూర్ ఎంట్రీ విషయంలో పాకిస్థాన్ పూటకో మాట మాట్లాడుతోందని అన్నారు. యాత్రికులకు పాస్ పోర్ట్ అవసరం లేదని సాక్షాత్తు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చెప్పారని… దీనికి సంబంధించి ఇప్పటికే రెండు దేశాల పరస్పర అవగాహనా ఒప్పందం కూడా కుదిరిందని చెప్పారు భారత అధికారులు. ఈ కారిడార్ ను భారత్ వైపు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. పాక్ వైపు ఇమ్రాన్ ఖాన్ ప్రారంభిస్తారు.
కర్తార్ పూర్ సాహిబ్ ప్రారంభానికి వెళ్లే భక్తుల నుంచి ఛార్జీ వసూలు చేయబోమని ఈ నెల 1న పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. అయితే వైఖరి మార్చుకున్న పాకిస్తాన్… ప్రతీ భక్తుడి నుంచి 20 అమెరికన్ డాలర్లు వసూలు చేయాలని నిర్ణయించింది.
రేపు పొద్దున పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు.. చాలామంది సిక్కు గురువులు, సిక్కులు కర్తార్ పూర్ కారిడార్ ద్వారా.. డేరా బాబా నానక్ దర్శనానికి వెళ్లనున్నారు. దీనిపై సిక్కు ప్రతినిధులు మన్మోహన్ సింగ్ ను కలిసి చర్చించారు.
డేరాబాబా నానక్ దర్శనానికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ వరుస లేఖలు రాస్తున్న పంజాబ్ ఎమ్మెల్యే నవజ్యోత్ సింగ్ సిద్ధూకు క్లియరెన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు పాకిస్థాన్ వీసా ఇచ్చింది. కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించింది. దీంతో మొదటి టీంలోనే సిద్ధూ.. కర్తార్ పూర్ వెళ్లనున్నారు.
