కరీంనగర్ టౌన్, వెలుగు: జిల్లాలో చేపట్టిన కీలక సాగునీటి, రైల్వే, రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల కు సంబంధించి భూసేకరణను వెంటనే పూర్తి చేయాలని కరీంనగర్ కలెక్టర్ చిత్రా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో రెవెన్యూ, ఇరిగేషన్, భూ సేకరణ విభాగం, నేషనల్ హైవే అథారిటీ ఆఫీసర్లతో సీపీ గౌష్ ఆలంతో కలిసి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ, ఇరిగేషన్తో పాటు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భూ సేకరణ చేయాలన్నారు.
రివ్యూలో ఎల్లంపల్లి, మిడ్ మానేరు, గౌరవెల్లి రిజర్వాయర్ కాలువలు, కాకతీయ కాలువ, కాలేశ్వరం ప్రాజెక్టు, కొత్తపల్లి–-మనోహరాబాద్ రైల్వే లైన్, మానేరు రివర్ ఫ్రంట్ తదితర ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం రోడ్ సేఫ్టీ కమిటి మీటింగ్లో సీపీతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్స్పాట్లను గుర్తించి, అక్కడ స్పీడ్ బ్రేకర్లు, హెచ్చరిక బోర్డులు, రోడ్డు మార్కింగ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజి వాకడే, శ్రీనివాస్ రెడ్డి, భూ సేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి, ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్, డీఈవో చైతన్యజైనీ, కరీంనగర్ ఆర్డీవో షర్మిల, అధికారులు పాల్గొన్నారు.
