హౌతీలకు పాక్ వార్నింగ్ .. సౌదీపై దాడికి ఖండన

హౌతీలకు పాక్ వార్నింగ్ ..  సౌదీపై దాడికి ఖండన
  • మక్కా ఒప్పందం అమలు చేయాల్సి వస్తుందని వార్నింగ్

ఇస్లామాబాద్: సౌదీ అరేబియాపై యెమెన్‌‌‌‌‌‌‌‌కు చెందిన హౌతీ రెబెల్స్ దాడులు చేయటంపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా స్పందించారు. సౌదీపై హౌతీల దాడితో 'మక్కా డిఫెన్స్ అలయన్స్' రక్షణ ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. హద్దులు దాటితే తగిన మూల్యం చెల్లించక తప్పదని హౌతీలకు స్పష్టం చేశారు. మంగళవారం ఇరాన్ మద్దతు గల హౌతీ బలగాలు మిసైల్స్, డ్రోన్లతో సౌదీ అరేబియాపై విరుచుకుపడ్డాయి. 

నగరాలు, ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడుల్లో మొత్తం 73 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. తమ ప్రాంతాలపై సౌదీ వైమానిక దాడులకు ప్రతీకారంగానే ఈ చర్య చేపట్టినట్లు హౌతీలు ప్రకటించారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఈ పరిణామాలపై పాకిస్తాన్ బుధవారం స్పందిస్తూ.. పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాల మధ్య ఇటీవల కుదిరిన ‘మక్కా డిఫెన్స్ అలయన్స్’ ఒప్పందాన్ని గుర్తుచేసింది. 

ఈ ఉమ్మడి రక్షణ ఒప్పందం ప్రకారం సభ్య దేశాల్లో ఏ ఒక్కదానిపై దాడి జరిగినా దానిని మూడింటిపై జరిగిన దాడిగానే పరిగణిస్తామని తెలిపింది. సౌదీపై జరిగిన దాడితో సంయుక్త రక్షణ ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ కూటమి కేవలం రక్షణ కోసం మాత్రమేనని, యెమెన్ ఘర్షణలను సరిహద్దులు దాటి విస్తరిస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హౌతీలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ప్రతిదానికీ సైనిక బలంతోనే బదులివ్వాల్సిన అవసరంలేదని, మూడు దేశాల సైనిక సామర్థ్యమే శత్రువులకు గట్టి హెచ్చరికగా నిలుస్తుందని అభిప్రాయపడింది.