మెదక్, వెలుగు: ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ అభ్యసనాన్ని ప్రోత్సహించడానికి గాను జిల్లాలోని మరో 60 స్కూల్స్ కు మేఘశాల ట్రస్ట్ డిజిటల్ లెర్నింగ్ టాబ్ లను బుధవారం పంపిణీ చేసింది. ఈ టాబ్ల్లో 6, 7, 8 తరగతులకు అవసరమైన గణితం, ఇంగ్లీష్, సైన్స్ , సోషల్ సైన్స్ పాఠ్యాంశాలకు అనుగుణంగా కంటెంట్ లోడ్ చేశారు.
ఈ కంటెంట్, విద్యార్థులకు తరగతి గది అభ్యసనాన్ని మరింత ఆసక్తికరంగా, ప్రభావవంతంగా చేయడానికి ఆకర్షణీయమైన ఇంటరాక్టివ్ బోధనా పద్ధతిని ఉపయోగిస్తుందని డీఈఓ రాజు, ఏఎంఓ సుదర్శనమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో మేఘశాల ట్రస్ట్ ప్రతినిధులు ప్రశాంత్, గంగాధర్ గౌడ్, హరీష్, మదన్, మెదక్ కోఆర్డినేటర్ లావణ్య పాల్గొన్నారు.
