ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(సీడీఎఫ్)గా ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ను అధికారికంగా నియమించింది. ఈ పదవిలో అతను ఐదేండ్లపాటు కొనసాగనున్నాడు. ఈ మేరకు చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్(సీఓఏఎస్), సీడీఎఫ్ గా మునీర్ నియామకం కోసం చేసిన సిఫార్సును అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ ఆమోదించినట్లు పాక్ ప్రధాని షెహ్బాజ్ షరీఫ్ శుక్రవారం ఎక్స్ వేదికగా ప్రకటించారు.
ఈ నియామకంతో మునీర్కు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పై పూర్తి అధికారం లభించనుంది. పాక్ అణు ఆయుధాలు, మిస్సైల్ వ్యవస్థలు అతని కంట్రోల్లోకి వెళ్లిపోనున్నాయి. మునీర్ దేశంలోనే అత్యంత శక్తిమంతమైన సోల్జర్ గా మారనున్నాడు. ఈ కొత్త పదవి మునీర్కు దేశ అధ్యక్షుడితో సమానమైన చట్టపరమైన రక్షణను కూడా అందిస్తుంది. ఏ రకమైన చట్టపరమైన ఆరోపణల నుంచైనా అతను జీవితకాల రక్షణను పొందే అవకాశం ఉంటుంది. ఆయన్ను ప్రాసిక్యూట్ చేసే అవకాశం కూడా ఉండదు.
