సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం : పల్లా రాజేశ్వర్ రెడ్డి

సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యం : పల్లా రాజేశ్వర్ రెడ్డి

కొమురవెల్లి, వెలుగు: సీఎం కేసీఆర్ తోనే అభివృద్ధి సాధ్యమని జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కిష్టంపేట, రాంసాగర్, గౌరాయపల్లి, మర్రిముచ్చల, లేనిన్ నగర్, కొమురవెల్లిలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను స్థానికుడినేనని జనగామలోనే ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానన్నారు. ఎన్నికలు వస్తాయి పోతాయని ఓటర్లు విజ్ఞతతో ఆలోచించాలని సూచించారు.

మాయ మాటలు చెబుతూ గ్రామాల్లో తిరుగుతున్న మోస పూరిత కాంగ్రెస్, బీజేపీ లకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. 60 ఏళ్లలో చేపట్టని అభివృద్ధిని కేవలం 9 ఎండ్లలో సీఎం కేసీఆర్ చేసి చూపించారని కొనియాడారు. రైతుబంధు, రైతుబీమా, సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్‌, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, కేసీఆర్‌ కిట్‌, బీసీలకు ఆర్థిక సాయం, గృహలక్ష్మి వంటి పథకాలతో ప్రజలకు లబ్ధి చేకూరిందన్నారు. ఎన్నికల తర్వాత రైతుబంధు సాయాన్ని రూ.16 వేలకు, ఆసరా పింఛన్లు రూ.5016 పెంచడంతో పాటు గ్యాస్‌ సిలిండర్‌ను రూ.400కే అందిస్తామన్నారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్ చేసే బాధ్యత తనదే అన్నారు. అనంతరం వివిధ పార్టీల నాయకులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ కీర్తన, జడ్పీటీసీ సిద్ధప్ప, సర్పంచ్ లు లత, స్వామి, శ్రీధర్, ఎంపీటీసీలు శ్రీరాములు, కిష్టయ్య, మహేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.